ప్రస్తుతం తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరు ఊరూ వాడా మార్మోగుతోంది. ఢిల్లీలో వెలుగు చూసిన.. లిక్కర్ కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని.. పేర్కొంటూ.. ఈడీ ఇప్పటికే ఆమెను ఒకసారి విచారించింది. ఇప్పుడుమరోసారి విచారణకు రావాలని పిలిచింది. ఈ విచారణ తర్వాత.. ఏం జరుగుతుంది? అనేది ఉత్కంఠగా మారింది. దీంతో అసలు కవిత కు ఈ కేసుకు సంబంధం ఏంటి? అనేది సామాన్యుల ప్రశ్న.
ఈ కోణంలో చూస్తే.. ఈడీ చెబుతున్న అంశాలను బట్టి.. ఢిల్లీ లిక్కర్ నూతన విధానం 2021-22 ప్రకారం.. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలు కూడా ఢిల్లీలో మద్యం వ్యాపారాన్ని దక్కించుకున్నాయి. కవిత నేతృత్వంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్చంద్రా రెడ్డిలు సౌత్ గ్రూప్గా ఏర్పడ్డారు. వీరు ఇండో స్పిరిట్
కంపెనీ ద్వారా ఢిల్లీలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించి సరుకును రవాణా చేస్తారు.
ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ వ్యాపారాన్ని 65 శాతం ఈ గ్రూప్ దక్కించుకుందనేది ఈడీ ఆరోపణ. అదేసమ యంలో 9 లిక్కర్ జోన్లపై నియంత్రణ ను కూడా ఈ గ్రూప్ దక్కించుకుంది. తద్వారా 30 శాతం వ్యాపారం ఇండో స్పిరిట్ కనుసన్నల్లో నే సాగనుంది. అంటే.. మద్యం రవాణా 65 శాతం, మద్యం వ్యాపారం 30 శాతం కూడా కవిత నేతృత్వంలోని గ్రూపే చూడనుంది. ఇంత వరకు బాగానే ఉంది.
అయితే.. ఇలా వ్యాపారం దక్కించుకున్నందుకు.. సౌత్ గ్రూప్లో ఎక్కువ షేర్ ఉన్న కవిత మొత్తంగా ఈ వ్యవహారాన్ని మేనేజ్ చేశారనేది.. ఆమే ఢిల్లీలోనూ చక్రం తిప్పారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. వచ్చే ఐదేళ్ల లో ఈ సౌత్ గ్రూప్ ఢిల్లీలో చేసే వ్యాపారం.. అంచనా విలువ 2500 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంత పెద్ద వ్యాపారం తమకు ఇచ్చిన ఆప్కు.. రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చారని.. ఈ మొత్తంలో 75 శాతం కవిత సమకూర్చారనేది ఈడీ చెబుతున్న మాట.
మిగిలిన 25 శాతం నిధులు అంటే.. 25 కోట్లు మిగిలిన వారు పంచుకున్నారు. ఈ నిధులు ఆప్కు విజయ్ నాయర్ ద్వారా మాగుంట రాఘవరెడ్డి అందించారని ఇప్పటికే తేల్చింది. అంటే.. మొత్తంగా 100 కోట్ల వ్యవహారంలో కవిత పాత్రే ప్రధానమన్నది ఈడీ చేస్తున్న కీలక ఆరోపణలు. దీంతోనే కవితకు ఇంత ప్రాధాన్యం ఏర్పడింది. అంటే.. ఈడీ చెబుతున్న లెక్క ప్రకారం.. సౌత్ గ్రూప్ మాస్టర్ మైండ్ అంతా కూడా కవితేనన్నమాట.