చేసిన మంచి పనులే చిరస్థాయిగా….

పార్టీలు వస్తాయి..పోతాయి…సీఎంలు వస్తారు..పోతారు.. చాలా మంది కాలగర్భంలో కలిసిపోతారు. కొందరు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతారు. మన తన అన్న భేదం లేకుండా సహాయం చేసే వారే ఎక్కువ కాలం ప్రజల నోళ్లలో నలుగుతారు… అలాంటి వారిలో చంద్రబాబు ఒకరిని ఇటీవల జరిగిన ఘటన నిరూపిస్తోంది..

పీలేరు నియోజకవర్గం చింతలవారిపల్లి మాజీ సర్పంచ్ అశోక్ ఒకప్పుడు వైసీపీకి కొమ్ముకాశారు. టీడీపీని అనరాని మాటలు అన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు తెస్తూ ప్రమాదానికి గురయ్యారు. దానితో రెండు నెలల పాటు మంచానికే పరిమితమయ్యారు. అశోక్ ను, ఆయన కుటుంబాన్ని వైసీపీ అసలు పట్టించుకోలేదు. కన్నెత్తి కూడా అటు వైపు చూడలేదు. దానితో అశోక్ కుటుంబ‌స‌భ్యులు టీడీపీ ప్రధాన కార్యదర్శి న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని సహాయం కోరారు. ఆయ‌న‌ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి సిఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 30 లక్షలు సహాయం ఇప్పించారు. వైద్యంతో అశోక్ ప్రాణాలు నిలిచాయి.

కులం, మతం, ప్రాంతం, పార్టీ భేషజాలు పోకుండా చంద్రబాబు ప్రభుత్వం సాయం చేసింది. ఆ సంగతి చాలా మంది మరిచిపోయినా.. అశోక్ కుటుంబం మాత్రం చంద్రబాబు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంది. పీలేరు నియోజకవర్గంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తూ చింతపర్తి విడిది కేంద్రంలో ఉన్న‌ నారా లోకేష్‌ని అశోక్ కుటుంబ సభ్యులు క‌లిసి చంద్ర‌బాబుకి, తెలుగుదేశం పార్టీకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. కన్నీటి పర్యంతమయ్యారు. అంత సాయం చేసినప్పటికీ కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం ఎక్కడా తన గొప్పదనాన్ని చెప్పుకోలేదు.