అవినాష్ రెడ్డికి మళ్లీ సమన్లు

సీబీఐ వదల బొమ్మాళి అంటోంది. వైఎస్ వివేనానంద రెడ్డి హత్య కేసులో విచారణకు రాకుండా జాప్యం చేసే వారిని వెంటబడి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఎంతటివారైనా సరే సీబీఐ అధికారులు వెళ్లి నోటీసులు ఇచ్చి వస్తున్నారు. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది….

సోమవారం హాజరు కావాలని అవినాష్ కు ఇటీవల సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. పులివెందుల వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. తేదీ మార్చడం కుదరదని చెప్పేశారు. అయితే ముందుగా నిర్ణయించిన సమావేశాలు ఉన్నందున సోమావరం రాలేనని అవినాష్ లేఖ పంపారు. పులివెందుల, వేంపల్లెలో కార్యకర్తల సమావేశాలున్నాయని అవినాష్ చెఫ్పుకొచ్చారు. మరో రోజున వస్తానని హామీ ఇచ్చారు.

ఆదివారం అవినాష్ లేఖ అందిన వెంటనే సీబీఐ అధికారులు వేగంగా స్పందించారు. మరో నోటీసు తీసుకెళ్లి పులివెందులలో ఆయన ఇంటిలో అందజేశారు. పదవ తేదీన హాజరు కావాలని అందులో ప్రస్తావించారు. ఆదివారం రాత్రి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు, పదో తేదీన హైదరాబాద్ లో హాజరు కావాల్సి ఉంటుందని అవినాష్ కు తెలిపారు. అంటే అవినాష్ సీబీఐ ముందు మూడో సారి హాజరవుతున్నారన్నమాట. అవినాష్ ను మాత్రమే లోపలికి అనుమతిస్తున్న సీబీఐ అధికారులు… ఆయన లాయర్లను కూడా బయటనే ఉంచుతున్నారు.

అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న కడపలో తమ ముందు హాజరు కావాలని ఆదేశించారుు. ఈ నోటీసులు రెండుమూడు రోజుల క్రితమే భాస్కర్ రెడ్డికి అందినట్లు సమాచారం. వివేకా కేసులో కీలకాంశాలను బేరీజు వేసుకునేందుకు భాస్కర్ రెడ్డిని ప్రశ్నించడం అనివార్యమవుతుందని సీబీఐ అంటోంది.