పెట్టుబ‌డుల స‌ద‌స్సులో ‘ప‌ట్టెడ‌న్నం’ కోసం కొట్టుకున్నారా?

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల స‌ద‌స్సు శుక్ర‌వారం ఘ‌నంగా ప్రారంభమైంది. ముఖ్య మంత్రి జ‌గ‌న్ ఈ స‌ద‌స్సును ప్రారంభించారు. ఇక‌, ఈ స‌ద‌స్సుకు దేశ‌, విదేశాల నుంచి కూడా ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌లు వచ్చారు. అయితే.. ఈ స‌ద‌స్సును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన‌ప్ప‌టికీ.. క‌నీస సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా స‌మ్మిట్ కు వ‌చ్చిన వారికి ఇచ్చేందుకు కిట్‌లు ఇచ్చారు. అయితే.. వీటిని స‌రైన విధానంలో పంపిణీ చేయ‌క‌పోవ‌డంతో తోపులాట‌లు చోటు చేసుకున్నాయి.

అదేస‌మ‌యంలో స‌మ్మిట్ స‌క్సెస్ కోసం.. తోచిన వారికి.. అడిగిన వారికి కూడా పాస్‌లు ఇష్యూ చేశారు. దీంతో అస‌లు పెట్టుబడులు పెట్టేవారి కంటే.. చూసేందుకు వ‌చ్చిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. పైగా ఉచిత రిజిస్ట్రేష‌న్ అన‌గానే . తండోప‌తండాలుగా వ‌చ్చేశారు. దీంతో అంత‌ర్జాతీయ‌, జాతీయ ప్ర‌తినిధుల‌ను గుర్తించ‌డంలో పోలీసులు ఇబ్బందులు ప‌డ్డారు. ఇక‌, భోజ‌నాల స‌మ‌యానికి మ‌రింత గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. కోట్ల రూపాయ‌లు(సుమారు 15 కోట్లు) ఖ‌ర్చు చేసిన ఈ స‌ద‌స్సుకు.. పెట్టుబ‌డులు ఎన్ని వ‌స్తాయో తెలియ‌దు. కానీ, వివాదాలు మాత్రం వ‌చ్చాయి.

పెట్టుబ‌డుల‌ సమ్మిట్‌లో కిట్‌లు, భోజనాల కోసం కుమ్ములాట జరిగింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. నిజానికి గ‌తంలోనూ చంద్ర‌బాబు హ‌యాంలో విశాఖ‌లోనే పెట్టుబ‌డుల స‌ద‌స్సు పెట్టారు. కానీ, భోజ‌నాల కోసం తోపులాట‌లు చోటు చేసుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం తీవ్ర వివాదంగా మారింది. ఎప్పుడైనా ఇన్వస్టర్స్ సమ్మిట్ పెట్టేటప్పుడు ఎవరు ఇన్వస్టర్లు, ఎవరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేదానిపై అధికారుల‌కు క్లారిటీగా ఉండాలి.

అయితే తాజా సమ్మిట్‌పై నీలిమేఘాలు క‌మ్ముకోవ‌డంతో స‌ద‌స్సును విజ‌య‌వంతం చేసుకునేందుకు.. జనసంఖ్య భారీగా కనిపించాలని ప్ర‌భుత్వం ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించింది. దీంతో భారీ సంఖ్య‌లో వ‌చ్చేశారు. ప‌లితంగా కిట్లు చాల‌లేదు. దీనికి తోడు భోజ‌న ఏర్పాట్ల‌లోనూ వీఐపీలు, వీవీఐపీల గ్యాల‌రీల్లోనూ సాధార‌ణ వ్య‌క్తులు దూసుకువ‌చ్చారు. దీంతో స‌మ్మిట్ తొలిరోజే వివాదాల‌కు.. విమ‌ర్శ‌ల‌కు.. ప్ర‌తినిధుల అవ‌మానాల‌కు.. అస‌హ‌నాల‌కు వేదిక అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.