60 మంది వైసీపీ నేత‌లు జంపేనా?!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఎవ‌రూ ఉండ‌రు. అంతేకాదు.. ఎప్పు డు ఎవ‌రు ఏపార్టీలోకి జంప్ చేస్తారో చెప్ప‌లేని ప‌రిస్థితి నేటి ప్ర‌జాస్వామ్యానిది. అవ‌స‌రం-అవ‌కాశం అనే రెం డు ప‌ట్టాల‌పైనే నాయ‌కులు ప్ర‌యాణాలు చేస్తున్నారు. ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. వైసీపీలో ఉన్న 150 (జ‌గ‌న్ మిన‌హా) మంది ఎమ్మెల్యేల్లో 60 మంది నేత‌లు త‌మ‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని.. టీడీపీ సీనియ‌ర్ నేత చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీశాయి.

ఇది నిజ‌మా? కాదా? అనేది ప‌క్క‌న పెడితే.. వైసీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. నిజం జ‌రిగేందుకు అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం వైసీపీలో ప‌రిస్థితి నివురు గ‌ప్పిన నిప్పులాగా ఉంది. ఎక్క‌డా కూడా నాయ‌కులు సంతోషంగా లేర‌నేది వాస్త‌వం. కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌డం.. వారినే నెత్తిన పెట్టుకోవ‌డం.. ప్ర‌తిదానినీ సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు ముడిపెట్టినామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌నే వాద‌న‌ ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు రెడ్డి సామాజిక వ‌ర్గంతోపాటు.. కాపులు, కొన్ని జిల్లాల్లో క్ష‌త్రియులు కూడా సాయం చేశారు. అయితే.. వీరికి ప్రాధాన్యం విష‌యంలో స‌రైన న్యాయం జ‌రగ‌డం లేద‌నే కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. “ఏదో ఊహించుకున్నాం. కానీ, ఏమీ జ‌ర‌గ‌డం లేదు” అని రెడ్డి వ‌ర్గం నాయ‌కులు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.

ఇక‌, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా విధులు, నిధులు కూడా లేకుండా చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల్లో తాము త‌లెత్తుకోలేక పోతున్నామ‌ని వాపోతున్నారు. అధికార వికేంద్రీక‌ర‌ణ జ‌పం చేసే సీఎం జ‌గ‌న్‌.. పార్టీ ప‌రంగా.. నాయ‌కుల ప‌రంగా కూడా అధికార కేంద్రీక‌ర‌ణే ప్రాధాన్యం ఇస్తున్నార‌నేది మెజారిటీ ఎమ్మెల్యేల మాట‌గా వినిపిస్తోంది. దీంతో ఇలాంటి వారంతా కూడా పార్టీ నుంచి జంప్ చేసేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.