ప‌దేళ్ల‌లో ఏపీలో పేద‌రికం లేకుండా చేస్తా: నారా లోకేష్

Lokesh Nara

యువ‌గ‌ళం. గ‌త 29 రోజులుగా చిత్తూరు జిల్లాలో సాగుతున్న పాద‌యాత్ర‌. టీడీపీ నేత‌, మాజీ మంత్రి నారా లోకేష్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని చేస్తున్న పాద‌యాత్ర‌. అయితే.. ఆదిలో పోలీసులు.. ఒకింత అడ్డంకులు సృష్టించార‌ని.. మైకులు లాగేశార‌ని.. స్టూల్ తీసుకువెళ్లార‌ని టీడీపీ నాయ‌కులు ఆందోళ‌న‌ల‌కు దిగారు. అయితే.. మ‌ధ్య‌లో ఒకింత దూకుడు త‌గ్గించిన పోలీసులు.. స‌జావుగానే సాగిస్తున్నారు.

అయితే.. మ‌ళ్లీ ఏమైందో ఏమో.. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి, మామండూరు దగ్గర యువగళం పాదయాత్ర ఫ్లెక్సీలను రెవెన్యూ అధికారులు తొలగించారు. అదేమంటే.. ఎన్నికల కోడ్ ఉందని ఫ్లెక్సీలు తొలగించామని చెబుతున్న‌ట్టు టీడీపీ నేత‌లు తెలిపారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేయకపోతే బతకలేమని నారా లోకేష్ పేర్కొన్నారు.

యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన రజకులతో ముఖాముఖి నిర్వహించారు. తమ పార్టీ అధికారం లోకి వచ్చాక నిత్యవసర వస్తువుల ధరలు తగ్గేందుకు కేరళ తరహాలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నా రు. బీసీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దొంగ కేసులు పెట్టి లొంగ తీసుకోవాలని చూస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలోకి రాగానే జ్యూడిషియ‌రీ ఎంక్వయిరీ చేసి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినవారిని డిస్మిస్ చేస్తామన్నారు.

పది సంవత్సరాల్లో ఏపీలో పేదరికం లేకుండా చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. రజకులను ఎస్సీలుగా రిజర్వేషన్లు కల్పించటం సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. తిరుపతిలో రజకుల భవనానికి వంద రోజుల్లో భూమి కేటాయిస్తామన్నారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు.