చంద్ర‌బాబుపై.. కేంద్రానికి సోము ఘాటు లేఖ‌..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై త‌ర‌చుగా ప‌రోక్ష విమ‌ర్శ‌లు గుప్పించే బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రా జు.. తాజాగా కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌కు.. ఘాటు లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీలోనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో గ‌త వారం చోటు చేసుకున్న ప‌రిణామాలు.. రాష్ట్రంలో ప‌రిస్థితిని సోము ఈ సందర్భంగా లేఖ‌లో ప్ర‌స్తావించార‌ని స‌మాచారం. ముఖ్యంగా చంద్ర‌బాబు వ‌ల్లే.. పార్టీ ఎద‌గ‌డం లేద‌ని..ఆయ‌న చెప్పినట్టు తెలుస్తోంది.

అన్ని లోపాల‌కు.. పార్టీ ఎద‌గ‌క‌పోవ‌డానికి కూడా చంద్ర‌బాబే కార‌ణం. అని సోము వీర్రాజు స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. ‘పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిస్తున్నాను. ఈ విష‌యంలో మీకు కూడా అనేక రిపోర్టులు ఇప్పటికే ఇచ్చాను. కానీ, చంద్ర‌బాబు మ‌న‌ల్ని బ‌త‌క‌నివ్వ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ కీల‌క నాయ‌కుల‌ను పార్టీలోకి తీసుకుంటున్నారు. ప‌ద‌వులు ఆశ చూపుతున్నారు. ఇలా అయితే.. పార్టీ బ‌త‌క‌డం క‌ష్టం’ అని సోము తేల్చి చెప్పిన‌ట్టు కీల‌క నేత‌ల మ‌ధ్య గుస‌గుస జోరుగానే వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం వెళ్లిపోయిన, వెళ్లిపోతార‌ని భావిస్తున్న పేర్ల‌ను కూడా సోము వీర్రాజు స‌ద‌రు లేఖ లో స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందీ లేద‌ని.. కేవ‌లం చంద్ర‌బాబు ఆయ‌న కు చెందిన కొంద‌రు వ్య‌క్తుల ద్వారానే పార్టీ ఇబ్బందుల్లో ప‌డుతోంద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించిన‌ట్టు తిరుప‌తికి చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు ఆఫ్‌దిరికార్డుగా చెప్పిన‌ట్టు స‌మాచారం.

“మా నాయ‌కుడు కేంద్రానికి లేఖ రాశారు. ఏం జ‌రుగుతుందో తెలియ‌దు.కానీ, రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి బాగోలేదు . ఎవ‌రినీ ఏమీ అనే ప‌రిస్థితి లేదు. మాతో న‌మ్మ‌కంగా ఉంటూనే మాకు వెన్నుపోటు పొడుస్తున్నా రు” అని ఆయ‌న కూడా వ్యాఖ్యానించారు. అంటే.. మొత్తంగా ఎన్నిక‌ల‌కు ముందు.. ఏపీలో బీజేపీ కీల‌క స్టెప్పే తీసుకుంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది తర్వాత ఎటు మ‌లుపుతిరుగుతుందో చూడాలి.