సేవకు గుర్తింపు.. క్యాడర్ ఖుషీ

తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులకు దళవాయి రామదేవి, వర్ల రామయ్యలను ప్రతిపాదించడం ద్వారా పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా బీసీ మహిళా నాయకురాలికి అవకాశం కల్పించడంతో పాటు, సీనియర్‌ దళిత నేతకు పదవి ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రామదేవి చాలాకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. డ్వాక్రా సంఘం అధ్యక్షురాలిగా మహిళలతో మమేకమై పనిచేస్తున్న ఆమె.. టీడీపీ క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌గా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. ఎలాంటి పెద్ద పదవి లేకున్నా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.

మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచే నిర్ణయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు చెందిన మరింత మంది ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే అవకాశం ఏర్పడనుంది. ఒకవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు.. మరోవైపు బీసీ మహిళా నాయకురాలు దళవాయి రామదేవికి ఎమ్మెల్సీ అవకాశం.. ఈ రెండు నిర్ణయాలు బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే మహిళా నాయకత్వానికీ అవకాశాలు కల్పిస్తున్నామనే సంకేతం వెలువడింది.

సీనియర్‌ టీడీపీ నేత, దళిత నాయకుడు వర్ల రామయ్యను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదించడం ద్వారా దళిత నాయకత్వానికీ సముచిత ప్రాతినిధ్యం కల్పించినట్లు అయింది. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నాయకుడికి పదవి ఇవ్వడం ద్వారా సేవలకు గుర్తింపు ఇచ్చినట్లు స్పష్టమైంది. దళవాయి రామదేవి, వర్ల రామయ్యల ఎంపిక కేవలం రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీగా కాకుండా.. కష్టానికి గుర్తింపు, సామాజిక ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం అనే రాజకీయ సందేశాన్ని ఇస్తోంది. పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు దక్కుతాయన్న నమ్మకాన్ని కేడర్‌లో పెంచుతోంది. మొత్తంగా లాబీయింగ్‌ కంటే సేవకు.. సిఫారసుల కంటే సమర్థతకు ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాన్ని టీడీపీ నాయకత్వం ఇచ్చిందనే చర్చ సాగుతోంది.