తండ్రి, కొడుకులు ఏపీ చ‌ట్ట‌స‌భ‌ల్లోనే…

తెలుగు రాజ‌కీయాల్లో కుటుంబ రాజ‌కీయాలు కొత్త కాదు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు, భార్య‌భ‌ర్త‌లు కూడా చ‌ట్ట‌స‌భ‌ల‌కు ప్రాథినిత్యం వ‌హించిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలోనూ ప‌లు కుటుంబాల‌కు చెందిన నేత‌లు రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. సాక్షాత్తు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కేబినెట్లో ఉన్నారు. ఇక చంద్ర‌బాబు వియ్యంకుడు, లోకేష్ మావ నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపురం నుంచి వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక లోకేష్ తోడ‌ళ్లుడు, బాల‌య్య చిన్న‌ల్లుడు శ్రీ భ‌ర‌త్ విశాఖ ఎంపీగా ఉన్నారు. ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి న‌లుగురు చ‌ట్ట‌స‌భ‌ల్లో కొన‌సాగుతున్నారు.

ఇక డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉప ముఖ్య‌మంత్రి.. ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక పుట్టా మ‌హేష్ కుమార్ ఎంపీగా ఉంటే.. ఆయ‌న తండ్రి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక పుట్టా మ‌హేష్ వ‌దిన య‌న‌మ‌ల దివ్య తుని ఎమ్మెల్యేగా ఉన్నారు. కింజార‌పు ఫ్యామిలీ నుంచి కేంద్ర మంత్రిగా రామ్మోహ‌న్ నాయుడు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఇక రామ్మోహ‌న్ నాయుడు మామ బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి మాడుగుల ఎమ్మెల్యేగా ఉంటే… రామ్మోహ‌న్ బావ ఆదిరెడ్డి వాసు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు ఏపీ స్పీక‌ర్‌గా, న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యేగా ఉంటే.. ఆయ‌న త‌న‌యుడు చింత‌కాయ‌ల విజ‌య్ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. వేమిరెడ్డి దంప‌తులు ఇద్ద‌రు ఒక‌రు ఎంపీగా, మ‌రొక‌రు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఈ కోవ‌లోనే మ‌రో ఇద్ద‌రు తండ్రి, కొడుకులు ఏపీ చ‌ట్ట‌స‌భ‌ల్లో ఒకేసారి కొన‌సాగే అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్యను ఎమ్మెల్సీగా ప్ర‌భుత్వం నామినేట్ చేసింది. వ‌ర్ల రామ‌య్య పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు.

గ‌తంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ, రాజ్య‌స‌భ‌కు పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎస్సీ వ‌ర్గంలో సీనియ‌ర్ నేత కావ‌డంతో ఆయ‌న్ను ఎమ్మెల్సీగా చంద్రబాబు ఎంపిక చేశారు. ఇక ఇప్ప‌టికే ఆయ‌న కుమారుడు వ‌ర్ల కుమార్ రాజా పామ‌ర్రు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా ఈ తండ్రి కొడుకులు ఇద్ద‌రూ చ‌ట్ట‌స‌భ‌ల్లో ఒకేసారి ప్రాథినిత్యం వ‌హించిన అరుదైన రికార్డు త‌మ ఖాతాలో వేసుకున్నారు.