కృష్ణా జిల్లా నేతలపై చంద్రబాబు ఆగ్రహం

చంద్రన్నకు కోపమొచ్చింది. అది అట్టాంటి, ఇట్టాంటి కోపం కాదు. పార్టీ నేతలను గట్టిగా కడిగి పారేశారు. ఉంటే ఉండండి, పోతే పోండీ అన్నట్లుగా గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. ఇదీ కృష్ణా జిల్లా కథ..

జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ దౌర్జన్యాలు, పోలీసుల థర్డ్ డిగ్రీ వంటి అంశాల పై నేతలు సరిగ్గా స్పందించలేదు. దీనిపై తెలుగుదేశం అధినేతతో పాటు, ఇతర సీనియర్ నేతలు సీరియస్ గా ఉన్నారు. తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గన్నవరం వెళ్లిన సమయంలో, అక్కడ పార్టీ కార్యాలయం విధ్వంసం, వాహనాల దగ్దం , అనంతరం పట్టాభి పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటి సంఘటనలకు సంబంధించి కృష్ణాజిల్లా నేతలు ఎవ్వరూ స్పందించకపోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఒక్కరు మాత్రమే సోమవారం గన్నవరం వెళ్లి పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో ఉన్నన్ని విభేదాలు ఇంక ఎక్కడా ఉండవని చెబుతారు. పార్టీని ఎవరికి వారు తమవైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఇతరులను కలుపుకుపోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదన గతంలో ఒక సారి చంద్రబాబు హెచ్చరించినప్పటికీ నేతల తీరు మారడం లేదు.

గన్నవరం సంఘటనల తర్వాత నేతల తీరుపై కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో కృష్ణా జిల్లా బ్యాచ్‌కు లాస్ట్ వార్నింగ్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకుని ఆ దిశగా బుధవారం కార్యాచరణ చేపట్టారు. చలో గన్నవరం కార్యక్రమానికి ఎవరూ సహకరించలేదని తెలుసుకుని చంద్రబాబు బాగా సీరియస్ అయ్యారు. బుద్దా వెంకన్న ఒక్కరే గన్నవరం వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వెళ్లి ఆయన్ను అడ్డుకున్నారు. పార్టీ నేతలు కేశినేని చిన్నీ, వెనిగళ్ల రాము, రావి వెంకటేశ్వరరావు, గుంటూరుకు చెందిన మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబులు మాత్రమే గన్నవరం వెళ్లి పట్టాభిని కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో పరామర్శించారు.

విజయవాడలో పట్టాభి ఇంటి వద్దకు పార్టీ జిల్లా నేతలు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. కొంతమంది వెళ్లి చుట్టపుచూపుగా పరామర్శించి వచ్చారు. ఈ పరిణామాలను తెలుసుకున్న చంద్రబాబు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చి నేరుగా పట్టాభి ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. వీలుంటే గన్నవరంలో దొంతు చిన్నా ఇంటికి కూడా వెళ్లాలని భావించానని , పోలీసులు అడ్డుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా నేతలకు చంద్రబాబు విడివిడిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే నేతలకు పట్టదా అని ఆయన మండిపడ్డారు. పద్దతి మార్చుకోపోతే తాను ఎవరినీ కూడా లెక్కచేయబోనని స్పష్టం చేసినట్టు తెలిసింది. దానితో హుటాహుటిన పట్టాభి ఇంటికి వెళ్లి ఆయన భార్యను పరామర్శించిన నేతలు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. మరి ఈ ఒక్క చర్య సరిపోతుందా లేక కృష్ణా జిల్లా నేతలకు చంద్రబాబు మళ్లీ క్లాస్ తీసుకోవాలో తెలియాల్సి ఉంది..