గ‌న్న‌వ‌రం టికెట్ ప‌ట్టాభికి ఇస్తున్నారా?

ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఏకైక విష‌యం గ‌న్న‌వ‌రం. ఇక్క‌డి టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అనుచ‌రులు.. దాడులు చేయ‌డం.. ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేయ‌డం.. వాహ‌నాల‌కు నిప్పు పెట్ట‌డం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీల‌క బాధితుడిగా మిగిలింది.. పార్టీ అధికార ప్ర‌తినిధి.. క‌మ్మ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన కొమ్మారెడ్డి ప‌ట్టాభి. కొన్నాళ్లుగా ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయడం.. స‌వాళ్లు విస‌రడంలోనూ ప‌ట్టాభిముందున్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌ట్టాభిని టార్గెట్ చేసిన పోలీసులు.. ఆయ‌నను అరెస్టు చేశార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తు న్నారు. ఇక‌, ఈ ఎపిసోడ్ జ‌రుగుతున్న క్ర‌మంలోనే ఒక సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ట్టాభి గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నార‌ని.. ఈ విష‌యం లీక్ కావ‌డంతోనే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇలా.. దాడులు చేయించార‌ని.. టీడీపీ నేత‌లు చేసిన కామెంట్లు చ‌ర్చ‌కు దారితీశాయి.

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌. గ‌తంలోనూ త‌ర్వాత‌.. కూడా అనేక ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటూ వ‌చ్చింది. ఇక‌, వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా పార్టీ టికెట్‌పైనే వ‌రుస విజ‌యా లు ద‌క్కించుకుంటున్నారు. అయితే.. ఇది త‌న ప్ర‌తిభేన‌ని ఆయ‌న అన్న‌ప్ప‌టికీ.. సంస్థాగ‌తంగా టీడీపీకి ఇక్కడ ఉన్న ఓటు బ్యాంకే కార‌ణ‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు వంశీతో టీడీపీ బంధం తెగిపోయిన నేప‌థ్యంలో గన్న‌వ‌రం టికెట్‌ను ఎవ‌రికి ఇవ్వాల‌నే విష‌యం టీడీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది.

ఇప్ప‌టికైతే.. బ‌చ్చుల అర్జునుడు ఉన్నారు. కానీ, ఆయ‌న అనారోగ్యంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ వ‌ర్గాలు.. సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌కు పొక్కాయి. పార్టీలో యాక్టివ్ గా ఉన్న ప‌ట్టాభికి ఇక్కడ టికెట్ ఇచ్చే అంశాన్ని పార్టీ అధిష్టానం ప‌రిశీలిస్తున్న‌ట్టు వారు చెప్పారు. ఇదే నిజ‌మైతే.. టీడీపీ త‌ర‌పున ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కడం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు వాస్త‌వ‌మో తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.