కన్నా బాటలోనే విష్ణుకుమార్ రాజు

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడిన తరువాత ఆ పార్టీలోని మరికొందరు అసంతృప్తులూ అదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేసిన కన్నా ఇంటికి విష్ణుకుమార్ రాజు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు.

బీజేపీలో పరిస్థితులు ఏమాత్రం బాగులేవని.. పార్టీలోని సమస్యలను హైకమాండ్‌కు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందో అర్థం కావడంలేదని… కార్యకర్తలతో మాట్లాడే తీరిక అధిష్టానానికి లేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. పార్టీలో విభేదాల గురించి అధిష్టానానికి చెప్పినా స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కన్నాతో ఉన్న వ్యక్తిగత అనుబంధం కారణంగా వచ్చి కలిసినట్లు ఆయన చెప్పారు. తాను పార్టీ మారబోవడం లేదని అన్నారు. అయితే, విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల తీవ్రత చూసినవారంతా ఆయన పార్టీ మారడం ఖాయమంటున్నారు.

టీడీపీతో పొత్తులలో భాగంగా 2014లో విష్ణుకుమార్ రాజు విశాఖ సిటీలో గెలిచారు. 2019 నాటికి బీజేపీ, టీడీపీ విడిపోయాయి. దీంతో 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా విష్ణుకుమార్ రాజు ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన పార్టీలో చురుగ్గానే ఉన్నప్పటికీ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడైన తరువాత ఆయనకు ప్రాధాన్యం తగ్గింది. దీంతో ఆయన కూడా సైలెంటయ్యారు. ఇప్పుడు కన్నా బీజేపీని వీడడంతో విష్ణకుమార్ కూడా వీడుతారన్న ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కన్నా లక్ష్మీనారాయణకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పంపింది. గుంటూరు జిల్లాకే చెందిన టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కన్నాతో భేటీ అయ్యారు. టీడీపీలోకి ఆయన్ను ఆహ్వానించారు. ఈ నెల 23న టీడీపీలో చేరాలని కన్నాను ఆహ్వానించామని.. పార్టీ తరఫున తాను వచ్చానని.. ఇది మర్యాదపూర్వక భేటీ అయిన ఆ సమావేశం తరువాత ఆలపాటి రాజా మీడియాకు చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి బలమైన నేత చేరడం టీడీపీకి మంచి పరిణామమని రాజా అన్నారు. కాగా కన్నా లక్ష్మీనారాయణ 23న చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరనున్నారు. తన చేరిక భారీగా ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.