నష్టం బాబుకా.. సాయిరెడ్డికా?

నందమూరి తారకరత్న మరణించిన సందర్భంగా అతడి పార్థివ దేహాన్ని దర్శించడానికి వచ్చిన సమయంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిల కలయిక అందరి దృష్టినీ ఆకర్షించింది. బాబు, సాయి రెడ్డి పక్క పక్కన కూర్చుని మాట్లాడుకోవడం.. ఆ తర్వాత చంద్రబాబు కారు ఎక్కబోతుండగా అక్కడికి కూడా సాయిరెడ్డి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.

సందర్భం ఏదైనప్పటికీ.. నిత్యం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల మీద ట్విట్టర్ వేదికగా దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసే సాయిరెడ్డి ఆయన్ని ఇలా కలిసి మాట్లాడడం చాలామందికి మింగుడు పడలేదు. తనను అన్నేసి మాటలు అనే సాయిరెడ్డిని చంద్రబాబు ఎందుకు దగ్గరికి రానిచ్చారని తెలుగుదేశం వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. వైసీపీ వాళ్లు సైతం రాజకీయంగా తీవ్రంగా విభేదించే వ్యక్తితో ఈ సాన్నిహిత్యం ఏంటనే ప్రశ్నలు సంధించారు.

ఐతే ఈ మొత్తం వ్యవహారంలో నష్టం జరిగి ఉంటే అది సాయిరెడ్డికే తప్ప చంద్రబాబుకు కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే ఎప్పుడూ చంద్రబాబును, లోకేష్‌ను సాయిరెడ్డి తిడుతుంటారు తప్ప.. బాబు సాయి రెడ్డి ప్రస్తావన తీసుకురారు. బాబు ఎవరినైనా రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తారే తప్ప వ్యక్తిగతంగా శత్రువులా చూడరనడానికి సాయిరెడ్డితో వ్యవహరించిన తీరే నిదర్శనం. తనను ఎన్ని మాటలు అన్నా కూడా తమ ఇద్దరికీ బంధువు అయిన తారకరత్న చనిపోయిన సందర్భం కాబట్టి సాయిరెడ్డి పక్కన కూర్చున్నా, మాట్లాడినా దాన్ని మరో రకంగా చూడలేదు. సాయిరెడ్డిని వ్యక్తిగత శత్రువుగా భావించి ఉంటే ఆయన దగ్గరకు రానిచ్చేవారు కాదు. తనను అన్ని మాటలు అన్నా కూడా అవేమీ పట్టించుకోకుండా సాయిరెడ్డిని గౌరవించడం ద్వారా బాబు తన ఔన్నత్యాన్ని చాటుకున్నట్లు అయింది.

ఇక చంద్రబాబును, లోకేష్‌ను దారుణాతి దారుణమైన మాటలు అని.. ఇప్పుడు చంద్రబాబును కలవడానికి సాయిరెడ్డికి మొహం చెల్లి ఉండకూడదు. కానీ అవసరం దృష్ట్యా కలిశారు, మాట్లాడారు. ఇది ఆయనకే ఇబ్బందికరం. అన్నింటికీ మించి ఇలాంటివి జగన్‌కు అస్సలు రుచించవు. ఆయన తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కక్షగట్టినట్లు వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీలో సాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గించిన జగన్.. తాజా పరిణామాలతో ఆయన మీద మరింత శీతకన్నేస్తే ఆశ్చర్యం లేదు.