ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌పై వైసీపీ నిఘా నేత్రం

గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ క‌ర్నూలు, నెల్లూరు, విజ‌య‌న‌గ‌రం వంటి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఆయా జిల్లాల్లో మొత్తంగా వైసీపీ అసెంబ్లీ స్థానాలు.. పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా గెలుచుకుంది. అయితే.. ఎటొచ్చీ.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో మాత్రం పాగా వేయ‌లేక‌పోయింది. అనుకున్న విధంగా క్లీన్ స్వీప్ చేయ‌లేకపోయింది. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ కీల‌క నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోట‌లుగా ఉన్న గోదావ‌రి జిల్లాల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తామ‌ని 2019 జ‌న‌వ‌రిలోనే ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో అలెర్ట‌యిన టీడీపీ ఒకింత జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రించింది. ఫ‌లితంగా తూర్పు, ప‌శ్చి మ గోదావరి జిల్లాల్లో కొంత వ‌ర‌కు అస్తిత్వావాన్ని నిల‌బెట్టుకుంది. కీల‌క‌మైన రాజ‌మండ్రి సిటీ, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. అదేవిదంగా ప‌శ్చిమ‌లో పాల‌కొల్లు, ఉండి వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం సాధించింది.

నిజానికి టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు ఉభ‌య గోదావ‌రి జిల్లాలే. ఈ రెండు జిల్లాల్లో కాపులు.. బీసీలు ఎప్పుడూ.. కూడా టీడీపీకి అండ‌గా ఉన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. ఈ జిల్లాల్లో మాత్రం టీడీపీదే హ‌వాగా న‌డిచింది. అయితే.. ఇది గ‌త ఎన్నిక‌ల్లో చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. అందుకే వైసీపీ మెజారిటీ స్థానాల్లో పాగా వేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు వైసీపీ టీడీపీని లేకుండా చేయాల‌నో.. లేక కంచుకోట‌ల్లో.. ప‌రాభ‌వం చేయాల‌నో ల‌క్ష్యంగా పెట్టుకుంది.

ఈ క్ర‌మంలోనే ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌పై ప్ర‌త్యేకంగా యాక్ష‌న్ ప్లాన్ రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన తోట త్రిమూర్తుల‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే..ఆయ‌న అనుకున్న విధంగా ముందుకు సాగ‌లేక‌పోతున్నారు. పైగా ఆయారాం గ‌యారాం బ్యాచ్‌గా ఆయ‌న‌కు పేరుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. మంత్రిగా ఉంటే.. త‌న దూకుడు చూపిస్తాన‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు ఆ కోరిక తీర్చేసి.. ఆయ‌న ద్వారా.. టీడీపీ బ‌లాన్ని త‌గ్గించాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌, గోదావ‌రి జిల్లాల్లో కీల‌క‌మైన కాపు నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభానికి ఇప్ప‌టికే అనేక సార్లు పిలుపు నిచ్చారు. ఆయ‌న స్పందించ‌లేదు. ఇప్పుడు మ‌రోసారి పార్టీ కేంద్ర క‌మిటీలో చోటుతో పాటు.. రాజ్య‌స‌భ స్థానం కూడా ఆఫ‌ర్ చేయ‌నున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. లేదా.. ఆయ‌న ఏం కోరుకుంటే అదే ఇవ్వాల‌ని కూడా నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. త‌ద్వారా.. గోదావ‌రి జిల్లాల‌పై వైసీపీ పంజా విసిరిన‌ట్టు అవుతుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్న‌ట్టు చెబుతున్నారు.