ష‌ర్మిలా ఇటు చూడు.. నీకు-వైఎస్‌కు ఎంత తేడానో!!

త‌మ కుటుంబం పాద‌యాత్ర‌ల కుటుంబమ‌ని.. త‌మ‌కే పేటంట్ ఉంద‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే వైఎస్ ష‌ర్మిల‌.. తెలంగాణ‌లో చేస్తున్న ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర ద్వారా అధికారంలోకి వ‌చ్చేయాల‌ని ల‌క్ష్యంగా పేట్టు కున్నారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. ఎందుకంటే.. ఎవ‌రి వ్యూహ‌మైనా.. ఉద్దేశ‌మైనా ఇదే. సో.. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. అయితే.. పాద‌యాత్ర‌లు చేసే విష‌యంలో ఇదే కుటుంబంలో వైఎస్‌కు.. ష‌ర్మిల‌కు ఉన్న తేడా ఇప్పుడు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది.

త‌న తండ్రి, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర చేశార‌ని.. ఆయ‌న బాట‌లోనే తాను న‌డుస్తున్నాన‌ని.. ష‌ర్మిల చెప్పుకొచ్చారు. త‌ర‌చుగా చెబుతున్నారు కూడా! అయితే.. వైఎస్ ఇలా అయితే.. పాద‌యాత్ర చేయ లేద‌ని అంటున్నారు పరిశీల‌కులు. 2003లో ఉమ్మ‌డి ఏపీలో పాద‌యాత్ర చేసిన వైఎస్‌.. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని దించేసి.. ఓట‌మి అలుపులో స్పృహ లేకుండా ప‌డిఉన్న కాంగ్రెస్‌కు జ‌వ‌స‌త్వాలు ఇవ్వాల‌నే నిర్ణ‌యంతో పాద‌యాత్ర చేశారు.

నిజానికి.. వైఎస్ పాద‌యాత్ర‌ను అడ్డుకున్న‌ది అధికార‌పక్ష‌మో… ఎవ‌రోకాదు.. సొంత పార్టీ నేత‌లే.. అనేక పుల్ల‌లు పెట్టారు. అయినా.. వాటిని త‌ట్టుకుని.. ఎవ‌రినీ ఒక్క ప‌రుష వ్యాఖ్య చేయ‌కుండా.. అప్ప‌టి అధికార పార్టీ టీడీపీపై ఎలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌కుండా.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. నేనున్నానంటూ.. వారిలో భ‌రోసా క‌ల్పించారు. అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా పేద‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

త‌న పాద‌యాత్ర ద్వారా మీడియాలో నిల‌వాల‌ని వైఎస్ కోరుకున్నారే త‌ప్ప‌.. త‌న విప‌రీత వ్యాఖ్య‌ల ద్వారా.. వివాదాస్ప‌ద కామెంట్ల ద్వారా.. బూతుల ద్వారా.. ఆయ‌న మీడియాలో నిల‌వాల‌ని.. సంచ‌ల‌నాల‌కు వేదిక కావాల‌ని కోరుకోలేదు. మ‌రి ఆయ‌న‌ను స్ఫూర్తిగా తీసుకుని పాద‌యాత్ర చేస్తున్నాన‌ని చెబుతున్న ష‌ర్మిల‌.. క‌నీసం.. తండ్రిగా వైఎస్ పాటించిన ఒక్క నియ‌మాన్న‌యినా.. పాటిస్తున్నారా? పేద‌ల‌కు చేరువ అవుతున్నారా? అనేది ఆత్మ విమ‌ర్శ చేసుకుంటే తెలుస్తుంది.

“నేను చేయాల్సింది చేస్తున్నా.. మీడియా క‌వ‌రేజ్ నాకెందుకు.. ప్ర‌జ‌ల క‌వరేజ్ ఉంటే చాలు” అని జాతీయ మీడియా చేసిన ఇంట‌ర్వ్యూలో కుండ‌బద్ద‌లు కొట్టి చెప్పిన వైఎస్ కుమార్తెగా.. ష‌ర్మిల ఆయ‌న‌ను అనుస‌రిస్తేనే మంచిద‌నిఅంటున్నారు ప‌రిశీల‌కులు.