జీవీఎల్ కు పురంధేశ్వరి గట్టి కౌంటర్

ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు. అధికారానికి వస్తుందన్న నమ్మకమూ ఇప్పట్లో లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్ర నాయకులు తెగ రెచ్చిపోతుంటారు. ఇంకేముందీ వచ్చే ఎన్నికల్లో ఇరగదీసేస్తామని చెప్పుకుంటారు. ఆ క్రమంలో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా కొనసాగుతుంటుంది. నిత్యం ఒక వర్గం పైచేయిగా నిలిచే ప్రయత్నం చేస్తుంటుంది. ఇటీవలే ఒక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ తన అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. అదే భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్లో నోటా కంటే తక్కువ ఓట్లున్న పార్టీ కూడా అదే..

ఆయనకు నోటి దురుసుతనం ఎక్కువ

జీవీఎల్ నరిసినంహారావు బీజేపీలో ఇప్పుడు క్రియాశీల నాయకుడు. ఎన్నికల సర్వేలు నిర్వహించే స్థాయి నుంచి బీజేపీ నాయకుడిగా ఎదిగిన జీవీఎల్.. ఒకప్పుడు అధిష్టానం దగ్గర మంచి మార్కులే కొట్టేశారు. దానితో ఆయనకు ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటిచ్చారు. యూపీలో జీవీఎల్ ఎప్పుడుంటారో ఎవరికీ తెలీదు. నిత్యం ఏపీలో ఉంటూ ఇక్కడి పార్టీలో తన వర్గాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు దిశానిర్దేశం చేసేది కూడా ఆయనేనని చెబుతారు. ప్రతీ రోజు ఎవరోకరిని ఏదోటి అనడం, వారితో నాలుగు మాటలు అనిపించుకోవడం జీవీఎల్ కు పరిపాటిగా మారింది.

చిన్నమ్మ కౌంటర్

తాజాగా వంగవీటి రంగాకు ఒక జిల్లా పేరు పెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అన్నీ వాళ్లిద్దరి పేర్లేనా… అని ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లను విమర్శించే విధంగా డైలాగులు వదిలారు. దానితో దుగ్గుబాటి పురంధేశ్వరికి చిర్రెత్తుకొట్టింది. గట్టిగానే కౌంటరిచ్చారు. ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు అని ఆమె ట్వీట్ చేశారు. అలాగని ఆ ఒక్క చిన్న మాటతో ఆగలేదు. మరో ట్వీట్ ను కూడా జతచేశారు. అందులో ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం, 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారని ప్రస్తావించారు. దానితో ఇప్పడు గట్టిగా బుద్ధి చెప్పారంటూ బీజేపీలోనూ, బయట జీవీఎల్ వ్యతిరేకులు సంతోష పడుతున్నారు..

ఇటీవలి కాలంలో బీజేపీ నుంచి కొందరు బలమైన నాయకులు వైదొలిగారు. కన్నా వెళ్లిపోయారు. రావెల కిషోర్ బాబు, బీఆర్ఎస్ లో చేరి చాలా రోజులైంది. మరి కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. సోము వీర్రాజు వర్గం కావాలనే కొందరిని పక్కన పెడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొందరికి పొమ్మనకుండానే పొగ పెడుతోందని చెబుతున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పురంధేశ్వరిని కూడా పక్కనపెట్టేందుకు వీర్రాజు ప్రయత్నిస్తున్నారని, దాని వెనుక జీవీఎల్ మంత్రాంగం ఉందని చెబుతున్నారు. దానితో అవకాశం కోసం వేచి చూస్తున్న పురంధేశ్వరి.. ఒక్కసారిగా జీవీఎల్ పై విరుచుకుపడ్డారు. ఇంకేముంది సోషల్ మీడియాకు కూడా మంచి టాపిక్ దొరికింది..