జ‌గ‌న్ రెడ్డీ.. ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పు: ప‌వ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. విశాఖ‌లో జ‌రిగిన ఒక ఘ‌ట‌న‌ పై సీఎంను ఆయ‌న నిల‌దీశారు. “రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పితీరాలి” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వమని మండిపడ్డారు. ఆస్పత్రులను మెరుగుపరచని వైసీపీ పెద్దలు, విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అని పవన్ విమర్శించారు.

బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్ల దూరం మోటార్ సైకిల్‌పై వెళ్లిన ఆ గిరిజన దంపతులతో పాటు ప్ర‌జ‌ల‌కు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రి లో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయమని పవన్ అన్నారు. ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదని, కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రిపడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదన్నారు. మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని, ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైంది? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

మహాప్రస్థానం వాహనాలే కాదు, అంబులెన్సుల నిర్వహణ కూడా సక్రమంగా ఉండటం లేదని, బెంజి సర్కిల్లో అంబులెన్సులు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు రూ.14 వేల కోట్ల బడ్జెట్ ఇచ్చామని చెబితే సరిపోదని, ప్రజలకు సేవలు అందాలన్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే విశాఖలో రాజధాని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు.

ఏం జ‌రిగిందంటే

విశాఖ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. విశాఖ‌లో మంచిపేరున్న కింగ్ జార్జ్ హాస్ప‌ట‌ల్‌(కేజీహెచ్‌)లో చనిపోయిన బిడ్డను తీసుకెళ్లేందుకు త‌ల్లిదండ్రులు అంబులెన్స్‌ను కోరారు. అయితే.. ఎంత బతిమాలినా ఆస్పత్రి సిబ్బంది కనిక‌రించ‌లేదు. ఇదే స‌మ‌యంలో ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో గత్యంతరం లేక మృతదేహాన్ని స్కూటీ పై పెట్టుకుని పాడేరు వరకు 120 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అక్కడ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ఆస్పత్రి సిబ్బంది.. పాడేరు నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఈ ప‌రిణామంపై రాజ‌కీయ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.