విన‌రో భాగ్య‌ము.. క‌న్నాపై జీవీఎల్ కామెంట్స్‌..!

వినేవాడు ఉంటే.. చెప్పేవారు చెడుగుడు ఆడ‌తార‌ని సామెత‌. ఇప్పుడు క‌న్నీ ల‌క్ష్మీనారాయ‌ణ‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ జీవీఎల్ న‌రసింహారావు కూడా అదే రేంజ్‌లో రెచ్చిపోయారు. తాజాగా క‌న్నా.. బీజేపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అయితే.. దీనిపై జీవీఎల్ తీవ్ర స్థాయిలో త‌న‌దైన శైలిలో విమర్శలు గుప్పించారు. కన్నా రాజీనామాపై పార్టీ నాయకులతో తాను మాట్లాడానన్నారు. కన్నాకు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చామ‌ని.. అయినా.. ఆయ‌న దానిని నిల‌బెట్టుకోలేద‌ని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గంలో‌ చోటు కల్పించారని జీవీఎల్ వెల్లడించారు. ఇవి రెండూ చాలా కీలకమైన పదవులని జీవీఎల్ పేర్కొన్నారు. నిజ‌మే.. కీల‌క‌మే.. కాద‌ని ఎవ‌రూ అన‌రు. కానీ, ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను క‌నీసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారా? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. రాష్ట్ర కార్య‌వ‌ర్గంలో కొంద‌రిని క‌న్నా వ‌ర్గంగా ముద్ర‌వేసి.. వారిని స‌స్పెండ్ చేయ‌లేదా.. కొన్ని సంద‌ర్భాల్లో పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపేయ‌లేదా? అనేది కూడా ప్ర‌శ్న‌గానే ఉంది. ఇక‌, కీల‌క‌మైన మీడియా చ‌ర్చ‌లు, స‌మావేశాల‌కు సైతం వీరిని దూరం చేయ‌లేదా? అనేది మాత్రం జీవీఎల్ ప్ర‌స్తావించ‌లేదు.

ఇక‌, రాజీనామా అనంత‌రం.. కన్నా చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ మాట్లాడుతూ.. స‌ద‌రు వ్యాఖ్య‌లు రాజకీయ దురుద్దేశమేనని అన్నారు. గతంలో కూడా సోము వీర్రాజుపై అనేక వ్యాఖ్యలు చేశారన్నారు. పార్టీలో సోము‌ వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి‌ చెప్పే చేశారన్నారు. నిజ‌మే పార్టీ అధిష్టానానికి చెప్పారు. మ‌రి రాష్ట్ర నాయ‌క‌త్వం కూడా ఉందిక దా…. దానికి కూడా చెప్పాలి క‌దా! పార్టీ అధిష్టానం ఇలా చెప్పింది.. మ‌నం ఏం చేద్దాం.. అని చ‌ర్చించాలి క‌దా! అన్న క‌న్నా ప్ర‌శ్న‌కు జీవీఎల్ ద‌గ్గ‌ర స‌మాధానం లేకుండా పోయింది.

తనపై కూడా గతంలో, ఇప్పుడు కన్నా ఎక్కువ విమర్శలు చేశారని జీవీఎల్ అన్నారు. తన పరిధిలో తాను పని‌ చేస్తున్నానని.. కన్నా విమర్శలపై తాను మాట్లాడబోనన్నారు. బయట పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా కన్నాకు కీలక పదవులు ఇచ్చారన్నారు. ఇది బీజేపీలో చాలా గొప్ప విషయం అన్నారు. సోము వీర్రాజుపై అనేక సార్లు విమర్శలు చేస్తూనే ఉన్నారన్నారు. ఇక‌ వీటిపై తాను ఇంత కన్నా మాట్లాడేదేమీ లేదని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అయితే.. ఇప్పుడు ఏం మాట్లాడినా ప్ర‌యోజ‌నం లేద‌ని.. ప‌రిశీల‌కులు అంటున్నారు. ఒక బ‌ల‌మైన కాపు నేత‌ను వాడుకోవ‌డం.. రాజ‌కీయంగా అడ‌గులు ముందుకు వేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.