రోజాకు ఈ సారి ఓట‌మి త‌ప్పేలా లేదా..!

మంత్రిరోజాకు ఈసారి ఓట‌మి త‌ప్పేలా లేదా? ఇది ఎవ‌రో టీడీపీ నేత‌లు చెబుతున్న మాట కాదు. వైసీపీ లోనే జ‌రుగుతున్న చ‌ర్చ‌. ప్ర‌స్తుతం న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ రోజాకు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని.. సొంత పార్టీ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు. దీనికి ప్ర‌ధానంగా మూడోసారి గెలిపించే అవ‌కాశం లేద‌ని.. ఇది సెంటిమెంటుతో కూడుకున్న‌ద‌ని కొంద‌రు చెబుతున్నారు.

అయితే.. మ‌రికొంద‌రు మాత్రం న‌గ‌రిలో ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని అంటున్నారు. దీంతో రోజాకు ప‌రిస్థితి అంత ఆశించినంత‌గా ఉండ‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం న‌గ‌రి నియోజ‌క‌వర్గంలో రోజా పై మిశ్ర‌మ స్పంద‌నే క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఆమె నిర్వ‌హించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు పాద‌యాత్ర కూడా ఆశించిన‌ట్టు సాగ‌లేదు. పైగా.. అనేక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌లు ప్ర‌స్తావించారు. దీంతో రోజా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఇదిలావుంటే.. గాలి భాను ప్ర‌కాశ్ ఇప్పుడు దూకుడు పెంచాల‌ని.. నారా లోకేష్ పాద‌యాత్ర సంద‌ర్భంగా క్లాస్ తీసుకున్నారు. ఇలానే ఉంటే ఓట‌మి త‌ప్ప‌ద‌ని.. తాను అన్నీ చూసుకుంటానని..అవ‌స‌ర‌మైతే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌చ్చి ప్ర‌చారం చేస్తాన‌ని.. ఇక్క‌డ మాత్రం నువ్వే గెల‌వాల‌ని.. నారాలోకేష్ తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో వెంట‌నే కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన గాలి భానుప్ర‌కాష్ రోజాపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

నియోజ‌క‌వ‌ర్గాన్ని దోచుకుంటున్నార‌ని అన్నారు. అస‌లు మంత్రి ఎలా అయిందో కూడా అర్ధం కావ‌డం లేద‌ని చెప్పారు. ఇక‌, పార్టీని ప‌రుగులు పెట్టించేందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ కూడా రూపొందించు కుంటున్న‌ట్టు స‌మాచారం. మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితులు రోజాకు ఇక‌పై ఉండే ఛాన్స్ అయితే.. క‌నిపించ‌డం లేద‌నేది వాస్త‌వం. మూడోసారి కావ‌డం..ఇప్ప‌టికే రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. భానుపై ఉన్న సింప‌తీ.. వంటివి రోజాకు డెత్ బెల్స్ మోగిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.