అసలే షర్మిల.. ఆపై కల్లు తాగింది

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలో బుధవారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది. పాదయాత్రలో ఆమె లక్ష్మీపురం స్టేజ్ వద్ద ఓ కల్లుగీత కార్మికుడితో మాట్లాడారు. అప్పుడే తీసిన కల్లు నింపిన కుండతో వస్తున్న ఆ గీత కార్మికుడు కాస్త కల్లు రుచి చూడమని షర్మిలను కోరారు. దీంతో ఆమె ఆకు పట్టి కల్లు రుచి చూశారు. కల్లుగీత కార్మికుల సమస్యల విన్న షర్మిల తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లుగీత కార్మికులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు.

కాగా పాదయాత్రలో ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై తీవ్రమైన విమర్శలు చేయడం షర్మిలకు అలవాటు. మామూలుగానే షర్మిల కేసీఆర్ నుంచి మొదలుపెట్టి స్థానిక నాయకుల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా పదునైన విమర్శలు చేస్తుంటారు. అలాంటిది ఆమె కల్లు తాగడంతో పాలకుర్తి దద్దరిల్లుతుందని ఆమె అభిమానులు, కార్యకర్తలు అంటున్నారు.

కాగా షర్మిల యాత్ర పాలకుర్తిలో సాగుతున్న సమయంలోనే బుధవారం రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా పాలకుర్తి చేరుకుంది. దేవురుప్పల నుంచి ధర్మవరం, మల్యాతండా, మైలారం మీదుగా రేవంత్ యాత్ర పాలకుర్తి చేరుకుంది. రేవంత్ యాత్ర కూడా పాలకుర్తి చేరిన నేపథ్యంలో షర్మిల రేవంత్ లక్ష్యంగా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిది పాదయాత్ర కాదని కారు యాత్రని విమర్శించారు. ఆయన సొంత పార్టీకి చెందిన నేతలు కూడా తమ నాయకుడిది కారు యాత్రే కానీ పాదయాత్ర కాదని ఎద్దేవా చేస్తున్నారన్నారు షర్మిల.

ఓటుకు నోటు కేసులో చిక్కిన రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందని.. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు అమ్ముడుపోయిందని షర్మిల అన్నారు. కాగా ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకునే షర్మిల పాలకుర్తిలో మాత్రం రేవంత్‌పై మండిపడ్డారు. పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తన పాదయాత్ర సమయంలోనే రేవంత్ పాదయాత్ర కూడా పాలకుర్తిలో ఉండడంతో షర్మిల తన ఫోకస్ రేవంత్‌పైకి మార్చారు.
అయితే.. రేవంత్, షర్మిల పాదయాత్రలు రెండూ ఒకేసారి పాలకుర్తికి చేరడం… రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండడంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేప్టటారు. పెద్దసంఖ్యలో బలగాలను మోహరించారు. డ్రోన్లతో నిఘా పెట్టారు. సుమారు 400 మంది పోలీసులను మోహరించి ఎలాంటి గొడవలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా చోట్ల దుకాణాలు మూసివేయించారు.