గుర్తు చేసుకుంటారు..భారత రత్న మాత్రం ఇవ్వరు…

నందమూరి తారక రామారావు… ఆ పేరే ప్రభంజనం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారానికి వచ్చిన రికార్జు ఎన్టీఆర్ మాత్రమే సాధించారని చెప్పకతప్పదు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన ధీరోదాత్తుడు మన ఎన్టీఆర్. పేద, బీసీ, బడుగు వర్గాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారు.

మోదీ నోట ఎన్టీఆర్ మాట

ఎన్టీఆర్ పరమపదించి 27 సంవత్సరాలైనా ఇంకా ఆయన మన హృదయాల్లో ఉన్నారు. బుధవారం పార్లమెంటులో ప్రధాని మోదీ ఎన్టీఆర్ ప్రస్తావన చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఆయన ప్రభుత్వాన్ని కూల్చారని గుర్తు చేశారు. వైద్యం కోసం ఎన్టీఆర్ విదేశాలకు వెళితే నిర్దాక్షిణ్యంగా, అకారణంగా బర్తరఫ్ చేశారని ప్రస్తావించారు..

ఆ ఒక్కటీ మాట్లాడరేం…

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చాలా రోజులుగా డిమాండ్లు, విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి సాధారణ వ్యక్తుల వరకు అందరూ అదే డిమాండును వినిపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పుకునే మోదీ నేతృత్వం ఎన్డీయే సర్కారు, ఆ ఒక్క విషయంలో మాత్రం ఇష్టపడటం లేదు అనిపిస్తుంది. ప్రతీ రిపబ్లిక్ డేకు ముందు ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తారని తెలుగు వారు ఎదురు చూడటం తర్వాత నిరాశలో మునిగిపోవడం జరుగుతోంది. లోక్ సభలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా గతేడాది ఒక ప్రస్తావన చేస్తూ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కోరారు.

మోదీ అప్పుడప్పుడు ఎన్టీయార్ ను గుర్తు చేసుకుని ప్రశంసిస్తుంటారు. భారత రత్న అనే మాట మాత్రం ఆయన నోటి నుంచి వినిపించదు. తాజాగా ఆర్టికల్ 356 ప్రస్తావన చేస్తూ ఎన్టీఆర్ ను బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. నిజానికి ఎన్టీఆర్ పేరు చెబితే ఏదో ప్రయోజనం కలుగుతుందని బీజేపీ భావిస్తుంది. టీడీపీకి పడే ఓట్లు తమకు వచ్చేస్తాయని ఎదురుచూస్తుంది. అయినా ఎందుకో దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చేందుకు ఆ పార్టీ నేతలు ఇష్టపడటం లేదు. పొరుగున ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ కు మరణానంతరం భారత రత్న పురస్కారం ప్రకటించి చాలా రోజులైంది. తెలుగు ప్రజలకు మాత్రం ఆ అదృష్టం దక్కడం లేదు.