జ‌గ‌న్‌కు భ‌యం అంటే ఏంటో రుచి చూపిస్తా: నారా లోకేష్‌

రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప‌ని అయిపోయింద‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు అధికారంలోకి రాబోతున్నార‌ని చెప్పారు. టీడీపీ ప్ర‌భుత్వం అంద‌రి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తుంద‌ని లోకేష్ భరోసా ఇచ్చారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు.

“జ‌గ‌న్ జ‌నం మ‌ధ్య తిర‌గ‌లేక‌పోతున్నాడు. ప్యాలెస్ పిల్లి ఒక వేళ బ‌య‌ట‌కొచ్చినా ప‌ర‌దాలు క‌ట్టుకుని తిరుగుతోంది. ప్ర‌జాద‌ర‌ణ‌లో మ‌నం ప‌బ్లిక్ గా తిరుగుతున్నాం. మ‌న‌ది ప్ర‌జాబ‌లం. జ‌నం ఆశీస్సుల‌తో యువ‌గ‌ళం పాద‌యాత్ర చేయ‌గ‌లుగుతున్నాం. నా ప్రచార ర‌థం, మైక్ సీజు చేశారు. జ‌గ‌న్ రెడ్డి నీకు తెలుగుదేశం అంటే ఎందుకు ఇంత భ‌యం?” అని నారా లోకేష్ నిల‌దీశారు.

టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌ని విద్యార్థుల‌పై అటెంప్టివ్ మ‌ర్డ‌ర్ కేసులు పెట్టార‌ని, కోర్టు చీవాట్లు పెట్టడంతో పోలీసులు విద్యార్థుల్ని వ‌దిలేశారని ఇంత‌క‌న్నా సిగ్గుమాలిన ప‌ని ఇంకోటి లేద‌ని చెప్పారు. చ‌ట్టాలు ఉల్లంఘించి మ‌రీ టీడీపీ కేడ‌ర్, లీడ‌ర్ల‌పై కేసులు పెడుతున్న పోలీసు అధికారుల‌పై టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ వేయిస్తామ‌న్నారు. త‌ప్పుడు మార్గంలో చ‌ట్టాలు ఉల్లంఘించే పోలీసుల‌కు త‌గిన గుణ‌పాఠం చెప్తామ‌న్నారు.

జ‌గ‌న్‌కు భ‌యం అంటే ఏంటో రుచి చూపిస్తాన‌ని నారా లోకేష్ అన్నారు. జ‌గ‌న్‌కు అస‌లైన భ‌యం ప‌రిచ‌యం చేసే బాధ్య‌త త‌న‌దేన‌ని చెప్పారు. 2024 త‌రువాత జ‌గ‌న్ అనే వ్య‌క్తి ఇంటి నుంచి అడుగు బ‌య‌ట‌పెట్టకుండా చేస్తాన‌న్నారు. లోటు బ‌డ్జెట్ తో ఏర్ప‌డిన రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సాధించ‌డంలో చంద్ర‌బాబు విశేష కృషి చేశారని చెప్పారు.

ఎక్క‌డెక్క‌డి నుంచో కంపెనీలు తీసుకువ‌చ్చి 6 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించారని నారా లోకేష్ అన్నారు. మ‌హిళ‌ల‌కు ప‌సుపు కుంకుమ కింద 20 వేల‌కోట్లు ప్ర‌యోజ‌నాలు క‌ల్పించారని చెప్పారు. చాలీచాల‌ని పెన్ష‌న్ తీసుకుంటూ ఇబ్బందులు ప‌డుతున్న అవ్వాతాత‌ల‌కు పింఛ‌ను రూ. 2000కి పెంచారని అన్నారు. ఉద్యోగుల‌కు 43 శాతం ఫిట్‌మెంట్, ప్ర‌తీ నెల ఒక‌టో తారీఖుని జీతాలు చెల్లించామ‌ని లోకేష్ వివ‌రించారు. “బాబు ఒక బ్రాండ్- జ‌గ‌న్ అంటే జైలు బ్రాండ్‌” అని ఎద్దేవా చేశారు.