సీఎంగా కేటీఆర్.. బడ్జెట్ సమావేశాలే వేదికగా కేసీఆర్ ప్లానింగ్?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నప్పటికీ.. డిఫ్యాక్టో సీఎంగా మంత్రి కేటీఆర్ ఎంతో కాలంగా వ్యవహరిస్తున్నారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. నిజానికి ఏడాదిన్నర క్రితం ఒకసారి ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేసి.. అధికారికంగా ప్రకటించేందుకు తయారవుతున్న వేళ.. అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటం తెలిసిందే.

కట్ చేస్తే.. మళ్లీ అలాంటి సీన్ తాజాగా వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలే నిదర్శనంగా చెబుతున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు బదులుగా మంత్రి కేటీఆర్ చేత మాట్లాడించటం హాట్ టాపిక్ గా మారింది. తన తర్వాత తన రాజకీయ వారసుడు కేటీఆర్ అన్న విషయాన్ని ఇప్పటికే తేల్చేసిన కేసీఆర్.. తన ముఖ్యమంత్రి పదవిని కొడుక్కి అప్పగించేందుకు సిద్ధమవుతున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.

దీనికి కారణం.. సాధారణంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రే ప్రసంగించాల్సి ఉంటుంది. చాలా అరుదుగా.. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం శాసన సభా వ్యవహారాల మంత్రి సమాధానం చెబుతారు. తాజాగా చూస్తే.. ప్రత్యేక పరిస్థితులు ఏమీ లేకున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించకుండా.. తన కొడుకు కేటీఆర్ చేత ప్రసంగించేలా చేయటం చూస్తే.. తన తర్వాత ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను చేసేందుకు రంగం సిద్ధమవుతుందన్న విషయాన్ని ఆయన చెప్పేసినట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది.

షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దానికంటే ముందుగానే ఎన్నికలు జరిగే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒకపక్క ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు అదేమీ లేదు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న వాదనను వినిపిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం వెళతారా?ముందస్తుకు వెళతారన్న దానిపై సందిగ్థత కొనసాగుతున్నప్పటికీ… తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ ప్రసంగించటం ద్వారా.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కొందరు చెబుతున్నా.. అదేమీ కాదని.. గవర్నర్ తో పంచాయితీ విషయంలో తాను తగ్గలేదన్న విషయాన్ని తెలియజేసేందుకే కేటీఆర్ చేత ప్రసంగించేలా చేశారన్న మాట వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై మరింత స్పష్టత కాలం ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.