టీపీసీసీలో ఐకత్య వచ్చిందా ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా యాత్ర రెండు నెలల పాటు కొనసాగబోతోంది. ముందుగా అనుకున్నట్లుగా భద్రాచలం రామయ్య గుడి నుంచి కాకుండా మేడారం సమ్మక్క సారలమ్మ గుడిలో పూజలు చేసి రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతున్నారు. మంచికి, మానవత్వానికి మారుపేరైన ఎమ్మెల్యే సీతక్క యాత్ర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. తొలి నాళ్లలో జన సమీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ ఆమె చేతిలో పెట్టింది.

హాత్ సే హాత్ జోడో అభియాన్ …యాత్ర షెడ్యూల్, జనంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సంబంధించి గాంధీభవన్ లో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు రేవంత్ రైవల్స్ గా పేరు పొందిన పలువురు నేతలు హాజరు కావడం విశేషంగా చెబుతున్నారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ప్రచార కమిటీ ఛైర్మెన్లు మధు యాష్కీ గౌడ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒకప్పుడు రేవంత్ ను బాయ్ కాట్ చేసిన నాయకులు వాళ్లు. వాళ్లంతా అలిగిన కారణంగా టీపీసీసీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ను సాగనంపి ఆయన స్థానంలో ఠాక్రేను నియమించారు.

మితవాదిగా చెబుతున్న ఠాక్రే అందరితో మాట్లాడి వారిని ఏకతాటిపైకి తెచ్చారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక వర్గాన్నే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన మధు యాష్కీ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇతరులకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని ఆరోపించిన వారంతా ఇప్పుడు రేవంత్ తో కలిసిపోయారు వాళ్లంతా పాదయాత్రలో తలో చేయి వేసేందుకు సిద్ధమవుతున్నారు..

ప్రస్తుతానికి రేవంత్ కు కాస్త దూరంగా ఉంటూ అప్పుడప్పుడు విమర్శలు సంధిస్తున్న వారిలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరు. ఆయన కూడా కలిసి వస్తారా.. శాశ్వతంగా దూరమవుతారా.. ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది…