జోడో యాత్ర ముగిసింది.. ఖర్చు మిగిలింది..!

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన జోడోయాత్ర ముగిసింది. కేర‌ళలోని వ‌య‌నాడ్ నియోజ‌వ‌ర్గం ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ దేశ ప్ర‌జ‌లనుక‌ల‌పాల‌నే ఉద్దేశంతో చేప‌ట్టిన యాత్ర క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు నిర్విఘ్నంగా ముందుకు సాగింది. అయితే.. యాత్ర ముగిసిన నేప‌థ్యంలో అస‌లు ఫ‌లితం ఎంత‌? దీని నుంచి కాంగ్రెస్ ఆశించింది.. ఆశిస్తోంది.. ఎంత అనే చర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

వాస్త‌వానికి ఒక నాయ‌కుడు కానీ, ఒక పార్టీ కానీ ఏం చేసినా.. త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నం లేకుండా ఏమీ ఉండ‌దు. అలాంటి అత్యంత ఖ‌రీదైన యాత్ర‌గా పేరు తెచ్చుకున్న జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ సాధించింది ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. యాత్ర‌సాగుతున్న స‌మ‌యంలోనే గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే, గుజ‌రాత్‌లో ఉన్న సీట్లు కూడా పోగొట్టుకుని కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం పాలైంది.

ఇక‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ ప్ర‌జ‌లు మార్పును కోరుకున్నారు కాబ‌ట్టి ఇక్క‌డ ముక్కీమూలిగీ బొటాబొటి మార్కుల‌తో అధికారంలోకి వ‌చ్చిన ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో జోడో యాత్ర ప్ర‌భావం ఆ ఎన్నిక‌ల్లో క‌నిపించ‌లేద‌నేది స్ప‌ష్టమైంది. ఇక‌, ఇప్పుడు ఫిబ్ర‌వ‌రిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర‌, నాగాలాం డ్‌, మ‌ణిపుర్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. మ‌రి ఈ యాత్ర ఏమేర‌కు ఫ‌లితం ఇస్తుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రోవైపు జోడో యాత్ర‌కు కొన‌సాగింపుగా.. రాష్ట్రాల స్థాయిలో హాత్ సే హాత్ యాత్ర చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నాయ‌కుల‌కు స‌మాచారం ఇచ్చింది. ఇదిలావుంటే, ఏపీ విష‌యానికి వ‌స్తే.. కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితికి ఏమైనా వ‌చ్చిందా? ఏపీలోనూ జోడో యాత్ర సాగిన నేప‌థ్యంలో దీని ప్ర‌భావం ఏమైనా ఉందా? అంటే.. ఏమీ లేద‌నే స‌మాధాన‌మే వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ యాత్ర‌తాలూకు ఖ‌ర్చు మాత్రం కోట్ల‌లోనే ఉండ‌డం ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌యం.