నేడు 160.. రేపు 41ఏ.. ముందుంది అసలు పండుగ

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, విచారణాంశాలను బయట పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని అవినాష్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. కొంతకాలంగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మీడియా ప్రచారం చేస్తోందని ఆవేదన చెందారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తానని అవినాష్ వెల్లడించారు…

2019 మార్చిలో వివేకానంద రెడ్డి హత్య జరిగితే అవినాష్ రెడ్డిని విచారించడం ఇదే మొదటి సారి. ప్రస్తుతానికి ఆయన్ను అనుమానితుడిగానే 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. త్వరలోనే నిందితుడిగా 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణకు సహకరించడం లేదన్న కోణంలో అరెస్టు చేసినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీబీఐ విచారణ తీరు అలాగే ఉంటుంది..సాధారణంగా విచారించిన వ్యక్తిని సీబీఐ అరెస్టు చేయకుండా ఉండదు..

ఫిబ్రవరి 10 కీలకం..

వివేకా కేసులో ఫిబ్రవరి 10 అత్యంత కీలకమైన రోజుగా భావిస్తున్నారు. ఆ రోజున ఐదుగురు వ్యక్తులు సీబీఐ ముందు హాజరవుతారు. నిందితులైన గజ్జల ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డితో పాటు అప్రూవర్ గా మారిన దస్తగిరిలు హాజరు కావాలని సీబీఐ సమన్లు పంపింది. ఆ లోపే కడప సెషన్స్ కోర్టు నుంచి తమకు అందిన ఎఫ్ఐఆర్స్, సిట్ దర్యాప్తు పత్రాలను సీబీఐ పరిశీలిస్తుంది. ఇప్పటికే 248 మంది వాగ్మూలాలు సిబీఐ వద్ద ఉన్నాయి. ఫిబ్రవరి 10న విచారణకు వచ్చిన వారిని ప్రశ్నిస్తే అవినాష్ రెడ్డి ప్రమేయానికి సంబంధించిన లింకులు దొరుకుతాయని సీబీఐ విశ్వసిస్తోంది. అవినాష్ రెడ్డి విచారణలో ఆయన కాల్ డేటాపై ప్రశ్నించారు..

ఆస్తి వివాదాలే కారణమా…

అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి మధ్య వైరానికి రాజకీయ కారణాలతో పాటు ఆస్తి తగాదాలు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. తొలుత కడప ఎంపీ సీటుపై పేచీ వచ్చిందని విశ్వసనీయ సమాచారం. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని తెలియడంతో కడప ఎంపీ సీటు తనకే కావాలని వివేకా పట్టుబట్టారు. అయితే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అప్పటికే జగన్ డిసైడ్ అయ్యారు. దానితో ఇద్దరి మధ్య వైరం పెరిగినట్లు చెబుతున్నారు. మరో పక్క బెంగళూరులో వంద కోట్లకు పైగా విలువ చేసే ఒక స్థల వివాదంతో ఇద్దరి మధ్యా పలు పర్యాయాలు మాటా మాటా పెరిగిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. కడప జిల్లాలో ఉన్న ఆస్తులకు సంబంధించి కూడా గొడవ జరిగేదన్న వాదన కూడా ఉంది.