విశాఖలో కేసీఆర్, జగన్ కలుస్తారా లేదా?

బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ తెలంగాణ దాటి రాజకీయాలు ప్రారంభించినా ఇంతవరకు ఆయన పాత మిత్రుడు జగన్‌ను మాత్రం కలవలేదు. త్వరలో ఆ ముచ్చటా తీరబోతోందంటున్నారు రెండు పార్టీలకు చెందిన నేతలు. ఈ నెల ఆఖరులో విశాఖలో కేసీఆర్, జగన్ ఒకే వేదికలో కలవొచ్చని చెప్తున్నారు. విశాఖ శారద పీఠంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు జగన్, కేసీఆర్ ఇద్దరికీ ఆహ్వానాలు అందాయి. దీంతో ఇద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంటున్నారు.

జనవరి 27 నుంచి 31 వరకు విశాఖ శారద పీఠం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. కేసీఆర్ ఈ యాగానికి హాజరుకానున్నారని శారదపీటం వర్గాలు చెప్తున్నాయి. గతంలోనూ ఇద్దరు సీఎంలు శారదపీఠాన్ని పలుమార్లు సందర్శించారు. శారద పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఇద్దరు సీఎంలకూ సన్నిహితులే.

కాగా కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఇతర సభలు నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాల నేతలను పిలుస్తున్నా జగన్‌ను మాత్రం ఆహ్వానించడంలేదు. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాలలోకి దిగగా.. జగన్ బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ను కేసీఆర్ ఇందులోకి పిలవడం లేదు.

మరోవైపు జగన్ సీఎం అయిన తరువాత ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకుని తిరిగినా ఆ తరువాత కాలంలో కృష్ణాజలాలు, పోతిరెడ్డిపాడు వంటి విషయాలలో విభేదాలొచ్చాయి. మరోవైపు జగన్ సోదరి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి కేసీఆర్‌ను నిత్యం విమర్శిస్తుండం కూడా ఇద్దరు నేతల మధ్య చికాకుపెట్టే విషయంగా ఉంది. షర్మిల సొంతంగా రాజకీయాలు చేస్తున్నారా.. అన్నకు తెలిసే చేస్తున్నారా.. అన్నతో విభేదాలున్నాయా అనే విషయంలో అనేక అస్పష్టతలు ఉన్నప్పటికీ జగన్ కుటుంబానికి చెందిన షర్మిల తనపై నిత్యం కారాలుమిరియాలు నూరుతుండడాన్ని కేసీఆర్ సహించడంలేదు.

మరోవైపు ఇప్పటికే కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీ ఏపీ శాఖను ప్రారంభించారు. అధ్యక్షుడినీ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయడం ఖాయమని చెప్తున్నారు. ఇలా ఏపీ రాజకీయాల్లో వేలుపెడుతున్న ఆయన వైసీపీతో కలిసి సాగుతారా లేదా అనేది ఇంకా తేలలేదు.

ఈ నేపథ్యంలో ఇద్దరూ సీఎంలు ఒకే కార్యక్రమానికి వస్తే కలుసుకుంటారా లేదా అన్నదీ ఇంకా తేలలేదు. శారద పీఠం కార్యక్రమం జనవరి 27 నుంచి 31 వరకు జరుగుతుండడంతో ఇద్దరూ వేర్వేరు తేదీలలో హాజరయ్యే అవకాశాలున్నాయన్న వాదనా ఒకటి వినిపిస్తోంది.

మొత్తానికి నెలాఖరులో జగన్, కేసీఆర్‌లు కలిసినా.. కలవకపోయినా బీఆర్ఎస్ విషయంలో రెండు పార్టీల వైఖరి ఎలా ఉండబోతుందన్న విషయంలో అంచనాలు రానున్నాయి.