వివాదాలకు కేంద్ర బిందువుగా ఆ విశ్వవిద్యాలయం

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్… హెచ్సీయూ, ఈ పేరు తెలియని వారండరు. మూడు నాలుగు దశాబ్దాల క్రితం అక్కడ ప్రవేశాల కోసం విపరీతమైన పోటీ ఉండేది. చదువు, క్రమశిక్షణకు మారుపేరుగా ఆ హెచ్సీయూ పేరును ప్రస్తావించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక సెంట్రల్ యూనివర్సిటీ అదీ. దేశ విదేశాల విద్యార్థులు వచ్చి అక్కడ చదువుతుంటారు. అంతలోనే సాఫ్ట్ వేర్ విప్లవం వచ్చి పడింది. ఇబ్బడిముబ్బడిగా ఇంజినీరింగ్ కళాశాలలు వచ్చాయి. దానితో యూనివర్సిటీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయింది. అందరూ బీఈ, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ చదివి వెంటనే ఉద్యోగాలు వెదుక్కోవడం మొదలు పెట్టారు. అయినా హెచ్సీయూ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. స్టేట్ యూనివర్సిటీలతో పోల్చితే హేచ్సీయూకు పోటీ వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు..

బీబీసీ డాక్యుమెంటరీ వివాదం

హెచ్సీయూలో చదివే వారిలో అభ్యుదయవాదమూ ఎక్కువే. అలాగే కొందరు అతివాదులు కూడా ఉంటారనుకోండి. వ్యవస్థలపై పోరాడాలన్న కోరిక, తప్పు చేసిన వారిని నిలదీయాలన్న ఆకాంక్ష వారిలో ఎక్కువగా ఉంటుంది. యూనివర్సిటీలో అంతర్గీనంగా ఉద్యమాలు జరుగుతుంటాయి. ఇప్పుడు యూనియన్లు బలపడటం, బయట వారి జోక్యం పెరగడంతో అక్కడ జరుగుతున్న ఉద్యమాలు, సంఘర్షణలు బయటకు కూడా తెలుస్తున్నాయ్. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీన్ షో వివాదాస్పదమవుతోంది.

అదేంటంటే బీబీసీ ఇటీవల ఒక డాక్యుమెంటరీ చేసింది. గోధ్రా అల్లర్లకు మోదీ బాధ్యుడంటూ అందులో ఒక రిఫరెన్స్ ఉంది. దానితో భారత ప్రభుత్వం దాన్ని నిషేధించింది. అయితే దాన్ని ఆన్ లైన్లో డౌన్ లోడ్ చేసి బీబీసీ డాక్యుమెంటరీని కొందరు యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రదర్శించారు. ఇందుకు అవసరమైన అనుమతులు తీసుకోలేదు. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(SIO), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్(MSF) లాంటి విద్యార్థి సంఘాలు దీన్ని ప్రదర్శించినట్లు మొత్తం 50 మంది వీక్షించినట్లు చెబుతున్నారు..

డాక్యుమెంటరీ ప్రదర్శనపై హెచ్సీయూ యాజమాన్యం తక్షణమే స్పందించింది. గచ్చిబౌలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారికంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ ప్రకటించింది. కొందరు విద్యార్థుల తీరుపై ఏబీవీపీ విద్యార్థి సంఘం మండిపడుతోంది. దేశంలో మళ్లీ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఏబీవీపీ ఆరోపిస్తోంది. డాక్యుమెంటరీని ప్రదర్శించిన వారితో పాటు వీక్షించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది..

విద్యార్థి వేముల ఆత్మహత్య

2016 జనవరి 17న దళిత రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో అప్పట్లో హెచ్సీయూ అట్టుడికింది. ఆరు నెలల పాటు అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్, ఏబీవీపి మధ్య ఘర్షణలు, కేసులు, యూనివర్సిటీ బహిష్కరణలు జరిగాయి. రోహిత్ వేముల ఆత్మహత్యకు ముందు, ఆ తర్వాత హెచ్సీయూ రాజకీయాల్లోకి బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఎంటరయ్యాయి. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి వేముల సంతాప సభలో పాల్గొని విశ్వవిద్యాలయ అధికారులు, ఏబీవీపీ తీరును ఎండగట్టారు. కేసు ఇంకా విచారణలో ఉంది. కాకపోతే జనం మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ బీబీసీ డాక్యుమెంటరీ వివాదం తెరపైకి వచ్చింది. దీన్ని ఎన్ని రోజులు సాగదీస్తారో చూడాలి…