అనుష్టుప్ యాత్రకు వేళాయే..జనసైన్యం కదులుతోంది

కొండగట్టు పవన్ కల్యాణ్ కు ఓ సెంటిమెంటు. ఏ పనైనా కొండగట్టు నుంచి మొదలెడితే శుభం కలుగుతుందని పవర్ స్టార్ విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోటీకి సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్.. తన వారాహి వాహనానికి కొండగట్టులో పూజలు నిర్వహిస్తున్నారు. వారాహి అంటే అమ్మవారి శక్తిస్వరూపం. వారాహి అమ్మవారిని సప్తమాతృకల్లో ఒకామెగా, దశ మహావిద్యల్లో ఒకామెగా కొలుస్తారు. ఆమె వరాహ ముఖం కలిగి ఉండటంతో వారాహిగా పిలుస్తారు. వారాహి దేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. సినిమా వాళ్లకు ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు సెంటిమెంట్, భక్తి రెండూ ఎక్కువగా ఉండటంతో తర్కించుకుని, ఆలోచించుకుని తన వాహనానికి వారాహి అని పేరు పెట్టారు..

కొండగట్టు అంజన్న ఆలయంలో ‘వారాహి’కి పవన్ కల్యాణ్ సంప్రదాయ వాహన పూజ నిర్వహించనున్నారు. అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ ముందుగా కొండగట్టు వెళ్లి పూజలు చేయనున్నారు. అనంతరం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని అనుష్టుప్ నారసింహ యాత్ర అంటే 32 నారసింహ క్షేత్రాల సందర్శనకు శ్రీకారం చుట్టనున్నారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపిన అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.

అనుష్టుప్ యాత్ర ఎందుకు…

పవన్ కల్యాణ్ కొండగట్టు పూజల తర్వాత 32 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు. ఛందస్సులో అనుష్టుప్ అంటే 32 అని అర్థం, అందుకే పవన్ కల్యాణ్ టీమ్ ఈ యాత్రకు అనుష్టుప్ అని పేరు పెట్టినట్లు చెబుతున్నారు. మరుగున పడిపోయిన సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని మళ్లీ జాగృతం చేసే చర్యలను కూడా మొదలు పెట్టే వీలుంటుందని విశ్వసించి ఉండొచ్చు.. పవన్ కు మరేదైనా సెంటిమెంట్ ఉందేమో చెప్పలేం..

అనుష్టుప్ అంటే…

కవిత్వరూపంలో ఉన్నవేద మంత్రాలన్నీ ఛందస్సుతో మిళితమయ్యాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైదిక కవిత్వాన్ని ఛందస్సంటారు. నిజానికి లయబద్ధమైన ఏ కవిత్వాన్నైనా ఛందస్సనే అంటారు. వీటన్నిటిలోనూ అనుష్టుప్‌ ను విరివిగా వాడతారు. . పురాణాలు, వాల్మీకి రామాయణంలో శ్లోకాలు అనుష్టుప్‌ ఛందస్సులోనే ఉన్నాయి.ఛందస్సు వేదపురుషుని పాదమని పరిగణిస్తారు. పాదం శరీరం చివరి భాగం, అది పద్యంలో ఒక భాగం కూడా. దేహంలో నాలుగో వంతు ఉన్న ఒక పాదం.. కవిత్వంలోనూ నాలుగో వంతు ఉంటుంది. మంత్రంలోగాని, శ్లోకంలోగాని నాల్గవభాగం పాదం.

ప్రతిపాదంలోనూ ఎనిమిది అక్షరాలుంటాయి – ఇంగ్లీషు పద్ధతిలోని అక్షరాలు కావు, సంస్కృత పద్ధతిలోనివి. అక్షరంగా పరిగణింప వలసినవి అచ్చులు, అచ్చులు చేర్చబడ్డ హల్లులు మాత్రమే. అప్పుడే ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలని తెలుస్తుంది.శ్లోకానికి నాలుగు పాదాలుండి, ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలుంటే దానిని అనుష్టుప్‌ ఛందస్సంటారు.ఎందుకంటే అందులో ముప్పై రెండు అక్షరాలుంటాయి. వాల్మీకి మహర్షి కాలం నుంచి ఇప్పటి వరకు అదే నియమం పాటిస్తున్నారు. శుక్లాంబరధరం విష్ణుం… నుంచి చాలా వరకు పద్యాలు ఈ రూపంలోనే మనకు కనిపిస్తాయి. మనకు తెలియకుండానే అనుష్టుప్ ఛందస్సులో పద్యాలు చదువుతున్నామని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఓ సందర్భంలో కృష్ణా పత్రిక సంపాదకుడు ముట్నూరు కృష్ణారావు కూడా అనుష్టుప్ అంటే 32 అని సందేశం ఇచ్చారు.

పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ ?

కవి, సినీ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ మంచి మిత్రులు. జన బాహుళ్యానికి అర్థమయ్యే పద ప్రయోగాల్లో త్రివిక్రమ్ దిట్ట అని చెప్పాలి. పవన్ కూడా పుస్తకాలు బాగా చదువుతారు. కనిపించిన ప్రతీ పుస్తకాన్ని నమిలి మింగుతారు. వారిద్దరూ కలిసి ఆలోచించి ఎన్నికల యాత్రకు అనుష్టుప్ అని పేరు పెట్టినట్లు ఇండస్ట్రీ టాక్. జనానికి అదే నిదానంగా అర్థమవుతుందన్నది వారి విశ్వాసం. ఏదేమైనా తెలుగు సాహిత్యాన్ని మళ్లీ నిలబెట్టేందుకు వాళ్లు ప్రయత్నించడం ముదాహవం.