కట్టడి చేస్తుందా? పరిస్థితి చేయి దాటి పోతుందా?

ఆధిపత్య పోరు అధికార పార్టీకే కాదు.. విపక్షంలోనూ ఉంటుందా ? టీడీపీ నేతలు రోడ్డున పడి కొట్టుకుంటున్నారా ? పార్టీ గెలవకముందే పచ్చ చొక్కాలు పదవులు పంచుకుంటున్నాయా ? అచెన్న, గంటా, అయ్యన్న ఇంకెందరో ఆశలు పెట్టుకుని ఉన్నారా ? వారిని పార్టీ కట్టడి చేస్తుందా ? పరిస్థితి చేయి దాటి పోతుందా ?

పార్టీలో అంతర్గత కుమ్ములాట
పరస్పర దూషణలు దిగిన నేతలు
గంటా ఏమైనా పెద్ద నాయకుడా అని ప్రశ్నించిన అయ్యన్న
కష్టకాలంలో గంటా నిద్రపోయాడని ఆరోపణలు
వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి గంటా విఫలం
తానే హోంమంత్రినని చెప్పుకుంటున్న అయ్యన్న
అసెంబ్లీకి పోటీ చేస్తానంటున్న రామ్మోహన్ నాయుడు
చాపకింద నీరులా నరుక్కొస్తున్న కావలి గ్రీష్మ
అంటీ ముట్టనట్లు ప్రవర్తిస్తున్న సీనియర్ నేతలు

ముందస్తు ఎన్నికలేమో గానీ, తెలుగు దేశం పార్టీ అప్పుడే విజయహాసం చేస్తోంది. కొందరు నేతలు వికటాటహాసం కూడా చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కు ఇంకా నెలల టైమ్ ఉన్నా.. ఇప్పుడే గెలిచేసినట్లుగా దర్బార్లు పెడుతున్నారు. పదవుల పందేరంలో పేచీలకు తెరతీస్తున్నారు. ఆలు లేదు చూలు లేదు అల్లుడిపేరు సోమలింగం అన్నట్లుగా మంత్రి పదవులు కూడా సెట్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ టీడీపీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఉత్తరాంధ్ర టీడీపీకి ఇదో శాపంగా మారింది.

పార్టీలో మంచి మర్యాద లేని పరిస్థితి కనిపిస్తోంది. నాయకులు ఒకరినొకరు వాడు వీడు అని సంబోధించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నాడని కాస్త పేరు రాగానే ఎక్కడ లేని గీర వచ్చేస్తోంది. దానితో తోటి వారి చిన్నచూపు చూడటం మొదలైంది. పైగా ఇప్పటి దాకా ఊగిసలాడిన కొందరు నేతలు మళ్లీ పార్టీలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటే… వాళ్లను తరిమేసేందుకు మరో బ్యాచ్ పనిచేస్తోంది..

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విరుచుకుపడుతున్న తీరు ఇంటా బయటా విస్మయానికి గురిచేస్తోంది. ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు.. లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా..? ప్రధానా..? అంటూ అయ్యన్న విరుచుకుపడిన తీరులో టీడీపీ అధిష్టానం కూడా ఖంగుతిన్నది. కష్టకాలంలో పార్టీని పట్టించుకోకుండా గంటా ఇంట్లో పడుకున్నాడని ఇప్పుడు గెలిచే సమయానికి మళ్లీ బయటకు వచ్చారని అయ్యన్న ఆరోపిస్తున్నారు. ఆయన చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది. గంటా వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జగన్ పిలుపు కోసం నిరీక్షించి విసుగు చెంది మళ్లీ టీడీపీతో టచ్ లోకి వచ్చారు. పైగా గంటా మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్.పార్టీ టికెట్ పొందడం, గెలవడం ఆయన చేతులో పనేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఉత్తరాంధ్ర పార్టీలో అచ్చెన్న, అయ్యన్న ఇప్పుడు కీలక వ్యక్తులు వైసీపీ ప్రభుత్వంతో ఫైట్ చేస్తూ పార్టీని నిలబెడుతున్నామన్న ఫీలింగులో వాళ్లున్నారు. అయ్యన్న పాత్రుడు ఆయన ఇద్దరు కుమారులు వైసీపీపై రాత్రి పగలు పోరాడుతూనే ఉన్నారు. జైలుకు కూడా వెళ్లొచ్చారు. దానితో టీడీపీలో అయ్యన్న గ్రాఫ్ పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలిచిన వెంటనే తాను ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రినైపోతానని అయ్యన్న బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఆయనే మంత్రి పదవిని తీసేసుకున్నారన్నమాట. మరో పక్క అచ్చెన్నాయుడు కూడా తన గ్రూపును చాపకింద నీరుగా డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో తన వారికి ఎక్కువ టికిట్లు ఇప్పించుకునేందుకు ఆయన స్కెచ్ వేస్తున్నట్లు తెలిసింది..

దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన మరోరకంగా చంద్రబాబును ఏడిపించే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను లోక్ సభకు పోటీ చేయబోవడం లేదని, అసెంబ్లీకి పోటీ చేస్తున్నానని ఆయన ప్రచారం మొదలు పెట్టారు.ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ సీటు ఇచ్చినా గెలిచి తీరుతానని చెబుతున్నారు.మంత్రి పదవిపై కన్నేసి ఆయన అసెంబ్లీ వైపు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఇక పార్టీ మహానాడులో తొడ కొట్టి ఫేమస్ అయిన కావలి ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ కొంత కాలం క్రితం బహిరంగ తిరుగుబాటు చేశారు. ఇప్పుడు స్థానిక నేతలకు పోటీగా ఒక గ్రూపును రెడీ చేస్తున్నారు. నాకు టికెట్ ఎందుకివ్వరూ కొండ్రు మురళీకి ఎందుకిస్తారని నిలదీస్తున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పార్టీలో సౌమ్యంగా ఉన్నట్లు గ్రీష్మ నటించినా..ఇప్పుడు ఆమె దూకుడును ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. రాజాం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసి తీరుతానని ఆమె జనంలో సవాలు చేస్తున్నారు. పైగా అవసరమైతే మరోసారి తొడ కడతానని ఆమె తేల్చేశారు.

కొంత మంది పార్టీ నేతలు, ఇంఛార్జులు ప్రస్తుతానికి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. అశోక గజపతి, కళా వెంకట్రావు లాంటి శక్తిమంతమైన నాయకులు కూడా నాకెందుకులే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. దానితో కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఉత్తరాంధ్రలో నిజానికి వైసీపీ బాగా వీకైపోతోంది. విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇంకెవరినైనా సరే జనం ఛీ కొట్టే పరిస్థితి వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకోకుండా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంతర్గత కీచులాటలతో టైమ్ పాస్ చేస్తున్నారు. చివరకు రిషికొండ విషయంలో పార్టీ నేతలు వేగాన్ని ప్రదర్శించకుండా అవకాశాన్ని జార విడుచుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదే పంథా కొనసాగితే వచ్చిన అడ్వాంటేజ్ పోతుందని పార్టీలో సిన్సియర్ గా పనిచేసే కార్యకర్తలు అంటున్నారు..