కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన కుమారస్వామి

ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నిర్వహించి రెండు రోజులవుతున్నా కేసీఆర్ కోరుకున్న బజ్ ఎక్కడా కనిపించడం లేదు. జనాన్ని తేగలిగినా జనంలో ఊపు మాత్రం తేలేకపోయారన్నది ఖమ్మం సభ తరువాత వినిపిస్తున్నమాట. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన, ఇతర పార్టీలరకు చెందిన నాయకులపై కేసీఆర్ పెట్టుకున్న హోప్స్‌కు ఈ సభ సమాధి కట్టేసిందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. కేసీఆర్ కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగినప్పటికీ ఆయన ఫ్రెండ్స్ మొహం చాటేశారు. మరీ ముఖ్యంగా మే నెలలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను చంకనెక్కించుకుంటారని అంతా భావిస్తున్న జేడీఎస్ నేత కుమారస్వామి కూడా రాకపోవడం కొట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సభ జరిగిన మరుసటి నేషనల్ మీడియాకు సంబంధించిన అన్ని వెబ్‌సైట్లలో పబ్లిష్ అయిన వార్తలను బీఆర్ఎస్ వర్గాలు ఎడాపెడా షేర్ చేస్తూ తమకు ఈ రేంజ్‌లో కవరేజ్ దొరికిందని మభ్యపెట్టే ప్రయత్నం చేశాయి. అదేసమయంలో కర్ణాటకలో జేడీఎస్ నేతలు బీఆర్ఎస్‌పై చేసిన కామెంట్లకు సంబంధించిన కన్నడ మీడియాలో వచ్చిన వార్తలను మాత్రం షేర్ చేసే సాహసం చేయలేకపోయాయి బీఆర్ఎస్ వర్గాలు.

బీఆర్ఎస్ పేరును కేసీఆర్ ప్రకటించినప్పుడు, టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ సంతకం చేసినప్పుడు కుమారస్వామి ఆయన పక్కనే ఉన్నారు. దిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభానికీ కుమారస్వామి హాజరయ్యారు. కానీ, ఖమ్మం సభకు మాత్రం కుమారస్వామి రాలేదు. ఉత్తర కర్ణాటకలో పంచరత్న యాత్ర పేరుతో రాజకీయ రథయాత్ర చేస్తున్నందున రాలేకపోయానని కుమారస్వామి.. ఎన్నికల్లో విజయం లక్ష్యంగా యాత్ర చేస్తున్న ఆయన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టంలేక కేసీఆర్ ఒత్తిడి చేయలేదని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నప్పటికీ పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు.

జేడీఎస్‌కు చెందిన కొందరు నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ విషయంలో బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటకలో జేడీఎస్ మొత్తం 224 సీట్లకు పోటీ చేస్తుందని, బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని వారు అంటున్నారు. మరోవైపు కుమారస్వామి కూడా కావాలంటే లోక్ సభ ఎన్నికలకు పొత్తు పెట్టుకుందాం కానీ అసెంబ్లీకి వద్దు అని కేసీఆర్‌కు చెప్పినట్లు సమాచారం.

అంతేకాదు… ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి వచ్చిన కుమారస్వామి ఆ తరువాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు జేడీఎస్ తరఫున తొలి జాబితాగా 93 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. జేడీఎస్‌తో కలిసి పోటీచేయాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతుంటే కుమారస్వామి ఏకపక్షంగా ఇలా అభ్యర్థులను ప్రకటించేయడం కేసీఆర్‌కు మింగుడుపడలేదు. కుమారస్వామి కూడా కేసీఆర్‌కు తమ ఉద్దేశమేంటో చెప్పడానికే ఎన్నికలకు చాలాముందుగా ఇలా దాదాపు సగం మంది అభ్యర్థులను ప్రకటించారని అంటున్నారు.

పైగా కర్ణాటకలో బీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపలేదని కుమారస్వామి కూడా అంచనాకు వచ్చారని.. అలాంటప్పుడు బీఆర్ఎస్‌తో పొత్తు వల్ల ప్రయోజనం లేకపోగా సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి వస్తుందన్న ఉద్దేశంతో కుమారస్వామి వెనక్కు తగ్గినట్లు సమాచారం. కాంగ్రెస్‌తో టెర్మ్స్ బాగున్నా కూడా ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న జేడీఎస్ ఇప్పుడు బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం శూన్యమన్న స్పష్టతకు రావడంతోనే ఖమ్మం సభకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.అందుకే పంచరత్న రథయాత్రను సాకుగా చూపించి కుమారస్వామి రాలేదని చెప్తున్నారు.