బాస్ మాటల్లో చురుకు తగ్గిందా?

అంచనాలు అంతలా లేనప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే.. అంతలా ఉంటుంది. ఇంతలా ఉంటుందన్న అంచనాలకు సంబంధించిన ముందస్తు విశ్లేషణలు ఉదరగొట్టే వేళలో.. ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గినా తుస్ మనే పరిస్థితి. ఖమ్మంలో తాజాగా ముగిసిన బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో కూడా అలాంటి పరిస్థితే నెలకొందన్న మాట వినిపిస్తోంది. సభాస్థలి 70 ఎకరాల్లో ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే 100 ఎకరాల స్థలాన్ని తీసుకొని.. ఏకంగా 70 వేల కుర్చీలు వేయించి.. మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు సభికులు హాజరు అవుతారన్న అంచనాలు ఒక ఎత్తు అయితే.. ఈ సభ నుంచి ఢిల్లీలో ఉన్న మోడీ మాష్టారికి రీసౌండ్ ఖాయమన్న వాదన జోరుగా సాగిన వేళ.. అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్న పరిస్థితి.

బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహజసిద్ధమైన ఉద్యమ వీరుడు బయటకు వస్తాడని.. నిప్పులు చెరుగుతారని.. ఆయన మాట్లాడిన మాటలతో జాతీయ మీడియా సైతం ఉలిక్కిపడి.. దాని మీద చర్చల మీద చర్చలు జరపటంతో పాటు.. దేశ వ్యాప్తంగా కేసీఆర్ మాటలు హాట్ టాపిక్ గా మారే వీలుందన్న మాట వినిపించింది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. అవసరానికి తగిన సురుకు కూడా కేసీఆర్ మాటల్లో మిస్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తన మాటల్ని బాణాల మాదిరి కస్సున దించే కేసీఆర్.. మోడీ మాష్టారి మీద చెరిగే నిప్పులతో కమలనాథులు కకావికలం కావటంతో పాటు.. పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తాయనుకుంటే.. అలాంటివేమీ లేకపోవటంతో తుస్ మనిపించేలా కేసీఆర్ మాటలు ఉన్నాయని చెబుతున్నారు. అసలు మెరుపులు లేవని చెప్పలేం కానీ.. అదిరేలా మాత్రం లేకపోవటం కనిపించింది. దీనికితోడు.. కేసీఆర్ మాటల్లో మంట పుట్టే తీరు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.ఖమ్మం సభలో ఆయన మాటలు అందుకు భిన్నంగా సాగాయని చెప్పాలి.

ప్రసంగం సైతం క్లుప్తంగా ఉండటం.. చాలా సేపు మాట్లాడతారన్న అంచనాలకు భిన్నంగా పదిహేను- ఇరవై నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించటం కూడా పలువురిని నిరాశకు గురి చేసిందని చెప్పక తప్పదు. కొన్ని మాటలు కేసీఆర్ కు ఏ మాత్రం నప్పలేదన్న మాట వినిపిస్తోంది. ఉదాహరణకు తన ఎనిమిదిన్నరేళ్ల కాలంలో అప్పుల మీద అప్పులుచేసిన ఆయన.. అప్పుల అవసరం లేకుండా పాలన చేయలేరా? అంటూ మోడీని ప్రశ్నించటం నవ్వు తెప్పించక మానదు.

ఇక.. మేక్ ఇన్ ఇండియా జోక్ ఇండియాగా మారిందన్నఆయన.. కష్టించి పని చేసే దేశంలో జనాభా తినేది మెక్ డోనాల్డ్ పిజ్జాలు.. బర్గర్లా? అంటూ ఆయన ప్రశ్నించటం బాగోలేదు. ఎందుకంటే.. మెక్ డోనాల్డ్ పిజ్జాలు అందించదు. అయినా.. తినే ఆహారం గురించి కేసీఆర్ మాట్లాడటం అర్థం లేదంటున్నారు. తాను అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో.. మెక్ డోనాల్డ్.. కేఎఫ్ సీ.. డామినోస్ లాంటి సంస్థలకు బదులుగా ప్రభుత్వమే.. రుచికరమైన.. ఆరోగ్య కరమైన.. సంప్రదాయకరమైన స్నాక్స్ ను అందించిందా? అన్నది ప్రశ్న. తాను మొదట చేసి.. తనను చూసి సిగ్గు తెచ్చుకోవాలనటం బాగుంటుంది కానీ.. అందుకు భిన్నంగా మాట్లాడితే.. ఏం బాగుంటుంది చెప్పండి.