ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపును రాసిపెట్టుకోవ‌చ్చా.. టీడీపీ టాక్‌…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ 175/175 సీట్లు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. దీనికి దీటుగా చంద్ర‌బాబు కూడా.. 175 రాగం అందుకున్నారు. మేమేం త‌క్కువ అంటూ.. ఆయ‌న కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు త‌మ్ముళ్లు రెడీ కావాల‌ని పిలుపునిచ్చారు. ఇది సాధ్య‌మేన‌న్న‌ది చంద్ర‌బాబు టాక్‌. అయితే.. ఈ క్ర‌మంలో తాజాగా అస‌లు రాష్ట్రంలో గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే నియోజ‌క‌వ‌ర్గాలు ఎన్ని అనేది టీడీపీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఎందుకంటే. ఇక్క‌డ గెలుపు ఖాయం.. అని తెలిస్తే.. మిగిలిన వాటిపై దృష్టి పెట్టి పార్టీని ముందుకు న‌డిపించడం తేలిక అవుతుందన్న‌ది.. పార్టీ వ‌ర్గాల భావ‌న‌. ఇప్పుడు ఇలాంటి వాటిపై టీడీపీ నాయ‌కులు దృష్టి పెట్టారు. వీటిలో ఫ‌స్ట్ ఉన్న‌నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. గత ఎన్నిక‌ల్లో కోల్పోయిన ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తీరుతామ‌ని.. మాజీ ఎమ్మెల్యే చింత‌మనేని ఘంటా ప‌థంగా చెబుతున్నారు. అదేవిధంగా విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, అనంత‌పురం అర్బ‌న్‌, ప‌ల‌మ‌నేరు, ప‌లాస‌, రాజాం, పుట్ట‌ప‌ర్తి, విజ‌య‌వాడ తూర్పు.. వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపును రాసిపెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి ఈ జాబితాలో ఇప్ప‌టికిప్పుడు 60-70 నియోజ‌క‌వ‌ర్గాలు తేలాయి. ఇక‌, ఈ జాబితాలో మంగ‌ళ‌గిరి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. వైసీపీ వైపు నుంచి పెద్ద ఎత్తున నాయ‌కులు టీడీపీలో చేరుతుండ‌డ‌మే. ఇలా.. పార్టీ నేత‌లు ఒక అంచ‌నాకు వ‌చ్చారు. ఇక‌, గ‌తంలో 2014 ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసిన‌ట్టుగా.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ క్లీన్ స్వీప్ అయ్యే జిల్లాల‌ను కూడా ముందుగానే నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలో గుండుగుత్త‌గా టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని అంటున్నారు. దీనికి రాజ‌ధాని సెంటిమెంటు ఉప‌యోగ ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. నెల్లూరులో రెడ్డి నాయ‌కుల‌ను ఆక‌ర్షించే ప‌నిని ఒక మాజీ మంత్రికి(సోమిరెడ్డికి కాదు) అప్ప‌గించి న‌ట్టు తెలుస్తోంది. క‌డ‌ప‌లో మాజీ నేత‌ల‌ను రంగంలోకి దింపి.. పార్టీని బ‌లోపేతం చేయాల‌ని భావిస్తున్నారు. ఇలా ఏవిధంగా చూసుకున్నా.. టీడీపీ అంచ‌నాలు.. పెరుగుతున్నాయి. రాసిపెట్టుకోవ‌చ్చ‌నే నియోజ‌క‌వ‌ర్గాలు కూడా పెరుగుతున్నాయి.