ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన ఆనంకు వైసీపీ ఎఫెక్ట్‌..!

వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ప్ర‌స్తుతం ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి గ‌త కొన్నాళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. త‌న నియోజ‌క‌వ‌ర్గం లో అభివృద్ధి చేయ‌డం లేద‌ని.. ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయ‌డం లేద‌ని.. కొన్నాళ్లు విమ‌ర్శించారు. ఇక‌, ఇటీవ‌ల.. ఏం చేశామ ని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తాం.. అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే.. ప్ర‌భుత్వానికి ఇప్పుడున్న 151లో 50 వ‌చ్చినా ఎక్కువేన‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి.

ఈ క్ర‌మంలోనే వెంక‌ట‌గిరి ఇంచార్జ్‌గా ఉన్న రామ‌నారాయ‌ణ‌రెడ్డిని వెంట‌నే తొల‌గించి.. నేదురుమ‌ల్లి రామ్ కుమార్‌ను నియ‌మించారు. ఇక‌, తాజాగా.. ఆనం వ్యక్తిగత భద్రతను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అయ్యాక సెక్యూరిటీని 2 ప్లస్ 2కు పెంచారు. ఇది పెంచింది కూడా వైసీపీ ప్ర‌భుత్వమే.

 ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం అధికారాలను కట్ చేస్తూ ఒకదాని తరువాత ఒక సంఘటన చోటు చేసుకొంటున్న తరుణంలో సెక్యూరిటీని కుదిం చడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కు సెక్యూరిటీని ఒన్ ప్లస్ ఒన్ నుంచి 2 ప్లస్ 2కు పెంచింది. సమాన హోదాలు కలిగిన ఇద్దరు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ విషయంలో ప్ర‌భుత్వం ఇలా వ్య‌వ‌హ‌రించడంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీసింది.