అందలం ఎక్కించిన మొండితనమే పీఠం దిగేలా చేయనుందా?

ఆలస్యం విషం అనే పెద్దోళ్లు.. నిదానమే ప్రధానమని చెబుతారు. అలానే ప్రాణాలు తీసే విషాన్ని.. పరిమితంగా వాడితే పోయే ప్రాణాల్ని నిలుపుతుంది. అంటే.. ఆయుధంగా మారిన సానుకూలాంశం తర్వాతి కాలంలో ప్రతికూలాంశంగా మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చే వారు.. పార్టీలు పెట్టే వారికి కొదవ ఉండదు. కానీ.. వారికి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్యనున్న తేడా ఏమంటే.. మొండితనం.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న విషయాన్ని బలంగా నమ్మటం.

కొన్ని సందర్భంగా ఇలాంటి మొండితనం.. పట్టుదల వరంగా మారతాయి. ఏది ఏమైనా సరే.. అధికారంలోకి రావటమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్లు సరంజామాను సిద్ధం చేసుకోవటమే కాదు.. పక్కా ప్లాన్ తో చంద్రబాబుకు ప్రతికూలంగా ఉండే అంశాల్ని ఒక్కొక్కటి తనకు అనుకూలంగా మార్చుకుంటూ.. ప్రత్యర్థులు విషయాన్ని అర్థం చేసుకునేలోపే ప్రజల మనసుల్లో తన ముద్రను వేయగలిగారు. దీంతో.. వరాల వర్షం కురిపించినప్పటికీ చంద్రబాబు కంటే కూడా జగన్ మాటలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏపీ ప్రజలు ఆయనకు అఖండ విజయాన్ని ఇచ్చారు.

అప్పటికే మూడుసార్లు చంద్రబాబు పాలనను చూసిన ఏపీ ప్రజలకు.. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆయన చేసిన విన్నపాన్ని ఏపీ ప్రజలు మన్నించారు. కుర్రాడు..అంతగా అడుగుతున్నాడు.. ఒకసారి అధికారం ఇస్తే పోలా? అంతలా అడిగించుకోవాలా? అందునా అడుగుతున్నది రాజన్న కొడుకు. అతడి మాటను విందామన్న భావన చాలామందిలోకి రావటంతో 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితం చారిత్రాత్మకంగా మారింది.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. 2014 ఎన్నికల్లో తాను ఓడే అవకాశమే లేదన్న నమ్మకం జగన్ లో ఎంతన్నది తెలిసిందే. ఎన్నికల ఫలితాలకు ముందే.. తన కాన్వాయ్ లో వాహనాలు ఎన్ని ఉండాలన్న దానిపై కూడా కసరత్తు చేసిన ఆయన.. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనకు తగిలిన షాక్ అంతా ఇంతా కాదు.

అదే రీతిలో 2019లో గెలుపు మీద ధీమా ఉన్నా.. 2014లో మాదిరి ఓవర్ కాన్ఫిడెన్సు కాకుండా ఆచితూచి అన్నట్లుగా పావులు కదపటమే కాదు.. ఎక్కడా తప్పులు దొర్లకుండా చూసుకోవటంలో సక్సెస్ అయ్యారు. అయినప్పటికీ.. 151 సీట్లు వస్తాయని మాత్రం జగన్ సైతం ఊహించలేదని చెబుతారు. అలా చూసినప్పుడు 2014లో కానీ 2019లో కానీ రెండు సందర్భాల్లోనూ జగన్ అంచనాలకు మించిన దుంఖం.. ఆనందాన్ని కలిగించాయని చెప్పాలి.

తాను చెప్పిన ఒక్కఛాన్స్ మాటకు ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును వారి ఆశలు.. ఆకాంక్షలకు తగ్గట్లే నడుచుకొని ఉంటే ఇప్పటిపరిస్థితి ఉండేది కాదన్న మాట వినిపిస్తోంది. గడిచిన మూడున్నరేళ్లలో కాలంలో జగన్ పాలనను చూసిన వారంతా ఇప్పటికే ఆయన తీరుపై ఒక అంచనాకు రావటమే కాదు.. ఏపీలో తాజాగా నెలకొన్న పరిస్థితులకు కారణం ఏమిటన్న దానిపై ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారని చెప్పాలి. అధికారంలోకి రావటానికి తనకు ఆయుధంగా మారిన మొండితనం.. పట్టుదలను సక్రమంగా వినియోగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు.

అందుకు భిన్నంగా తన రాజకీయ ప్రత్యర్థుల్ని నిలువరించటానికి.. వారిని ఉక్కిరిబిక్కిరి చేయటానికి.. తమను వ్యతిరేకించేవారిని సంగతి చూడటానికి తన చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించటం.. ఆ విషయంలో మొండిగా వ్యవహరించటమే తప్పించి.. తన తీరు మార్చుకోవటానికి మాత్రం అస్సలు ఇష్టపడని ఆయన ధోరణి.. రానున్న రోజుల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు.

ఇప్పటికి సమయం మించిపోలేదని.. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జగన్ నోటి నుంచి వచ్చిన.. ‘యాభై రోజుల తన పాలనలో ప్రత్యర్థులు సైతం తనను అభిమానించి.. ఆరాధించేలా పాలన సాగుతుంది’ అన్న మాటలో పాతికశాతం అమలైనా పరిస్థితులు మరోలా ఉంటాయంటున్నారు. అందుకే.. తన మొండితనాన్ని తగ్గించుకొని.. ప్రత్యర్థుల మీద కంటే కూడా పాలన మీద ఫోకస్ చేస్తే ఫలితం ఉంటుందంటున్నారు. మరి.. ఈ విషయాన్ని జగన్ గుర్తిస్తారా? అలాంటి పరిస్థితి ఉందా? అన్నవే అసలు ప్రశ్నలుగా చెప్పక తప్పదు.