వైసీపీ ఎమ్మెల్యేకి ‘మేము సైకిల్ గుర్తుకే ఓటేస్తాం’ అని చెప్పిన మహిళలు

అనేక‌ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతున్నాం.. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు కూడా అమ‌లు చేస్తున్నాం.. సో.. జ‌నం నోట జ‌గ‌న్ మాటే వినిపిస్తుంది.. వినిపిస్తోంద‌ని ప‌దే ప‌దే చెప్పే వైసీపీ నాయ‌కుల‌కు శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌లు భారీషాక్ ఇచ్చారు. ‘మేము సైకిల్ గుర్తుకే ఓటేస్తాం’ అని వైసీపీ ఎమ్మెల్యే ఎదుట సిక్కోలు మహిళలు తేల్చిచెప్పారు. దీంతో నిర్ఘాంత పోయిన స‌ద‌రు ఎమ్మెల్యే మౌనంగా అక్క‌డ నుంచి నిష్క్ర‌మించారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

‘గడపగడపకూ మ‌న‌ ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తాజాగా శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం వెంకయ్యపేటలో పర్యటించారు. ఆయన గ్రామంలోకి అడుగిడగానే సమస్యలు స్వాగతం పలికాయి. రోడ్లు, కాలువలు నిర్మించాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ఆరా తీస్తుండగా ‘పండగపూట పప్పన్నం తినొద్దా! ఒట్టి బియ్యమే తింటామా? తెలుగుదేశం హాయాంలో పండగపూట పప్పుదినుసులు ఇచ్చేవారు’ అని కొందరు మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అద్దంకి ఆదెమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే కిర‌ణ్‌ ప్రభుత్వ పథకాలు వివరించి ఎవరికి ఓటు వేస్తారని అడిగారు. దీంతో ఆదెమ్మ “నేను సైకిల్ గుర్తుకే ఓటు వేస్తా” అని చెప్పడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. అక్కడే ఉన్న మ‌రికొంద‌రు మ‌హిళ‌లు మాత కాంతమ్మ, కొండపల్లి శాంతమ్మ కూడా తాము కూడా సైకిల్‌కు ఓటు వేస్తానని చెప్పడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి వలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఇదేనయ్యా మీరు ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకువెళ్లిన తీరు.. అసలు మీరేమి చేసు న్నారు? కనీసం యాభై గృహాల వారికి కూడా అవగాహన కల్పించలేరా? ఇందుకా ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది. తీరు మార్చుకోకపోతే వలంటీర్ల బాధ్యతల నుంచి తీసివేస్తాం’ అని హెచ్చరించారు. మనం పథకాలు ఇస్తే గ్రామస్థుల నోట సైకిల్ అనే మాట రావడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోసం వలంటీర్లు పనిచేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.