శవాల మీద పేలాలు ఏరుకోవడం ప్రారంభం

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సభలో బుధవారం పెను విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది దుర్మరణం పాలయ్యారు.

రాత్రి పూట చంద్రబాబు వచ్చినప్పుడు అపరిమిత సంఖ్యలో జనం గుమ్మిగూడారు. వెల్డింగ్ షాపుపైకి ఎక్కేందుకు ప్రయత్నించి కొందరు కింద పడిపోయారు. చంద్రబాబు వారించినా వాళ్లు ఆగలేదు. షెడ్డు రేకులు విరిగిపోవడంతో గుండంకట్ట ఔట్ లెట్ గట్టు మీద నిలబడి ఉన్న వారి పై కొందరు పడిపోయి మరణాలు సంభవించాయి.

చంద్రబాబు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వెంటనే వెనక్కి వచ్చి సభా స్థలి వద్ద మృతుల కుటుంబాలకు తలా రూ. 10 లక్షల సాయం ప్రకటించారు. రెండు నిమిషాలు మౌనం వహించిన తర్వాత సభను ముగించి వెళ్లిపోయారు. ఇదీ అసలు జరిగిన విషయం. అధికార వైసీపీ మాత్రం పేలాలు ఏరుకునేందుకు ప్రయత్నిస్తోంది అని టీడీపీ వారు విమర్శిస్తున్నారు

చంద్రబాబు పేరు చెబితేనే ఒంటి కాలి మీద లేచే వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఈ దుర్ఘటనపై కూడా కాస్త ఎక్కువే మాట్లాడారు. ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి చంద్రబాబే కారణమని నాని ఆరోపించారు. ఇరుకు సందుల్లో సభలు వద్దని స్థానిక నాయకులు చెప్పినా వినకుండా గుంపును చూపించేందుకు అక్కడ సభ పెట్టారని నాని ట్వీట్ చేశారు. కేవలం పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తారని ఆయన ఆరోపిస్తున్నారు.

బాదుడే బాదుడు సక్సెస్ కావడం, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి భారీగా అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలి రావడం చూసిన వైసీపీకి నిద్ర పట్టడం లేదన్న చర్చ జరుగుతోంది. వారం రోజులుగా చంద్రబాబు సభలను టార్గెట్ చేస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. జనం ఎక్కువగా వచ్చారని చూపించేందుకే చిన్న సందుల్లో రోడ్ షోలు పెట్టి, అక్కడే ప్రసంగాలు చేస్తున్నారని వైసీపీ అంటోంది.

ఇప్పుడు మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి కూడా అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చేశారు. సభకు ఎక్కువ మంది వచ్చారని డ్రోన్ కెమెరాల ద్వారా చూపించేందుకు అందరినీ ఒక వైపే గుంపుగా నిల్చోబెట్టారని శ్రీవాణి ప్రధాన ఆరోపణ. “చంద్రబాబు&కో కు అమాయకుల ప్రాణాల కన్నా పబ్లిసిటీనే ముఖ్యమా? ” అని ఆమె ప్రశ్నించారు.

నిజానికి చంద్రబాబు సభ ప్రత్యక్ష ప్రసారం చూసిన వారికి వైసీపీ నేతల మాటల్లోని డొల్లతనం అర్థమవుతుంది. మెకానిక్ షెడ్డుపైకి జనం ఎక్కుతున్నారని చంద్రబాబు వాహనంపై ఉన్న టీడీపీ నేతలు గుర్తించి, ప్రమాదం పొంచి ఉందీ.. వెంటనే దిగిపోవాలని వారిని అభ్యర్థించారు. చంద్రబాబు కూడా ఆ సంగతి గ్రహించి .. తమ్ముళ్లు అక్కడ నుంచి దిగండి అని పదే పదే వేడుకున్నారు. అయినా భారీగా వచ్చిన జనం .. చంద్రబాబు మాటను అర్థం చేసుకుని దిగే లోపే అనర్థం జరిగిపోయింది.. పైగా ఆ కాస్త చోట్లో ఉన్న వారంతా స్థానికేతరులు. కాలువలో పడిపోతామన్న ఆలోచన వారికి రాలేదు. కందూకూరు ఎన్టీఆర్ సర్కిల్ సభకు అంత రేంజ్ లో జనం వస్తారని అంచనా వేయలేకపోయిన మాట మాత్రం వాస్తవం.