యనమల కుటుంబంలో ముసలం

గత ఎన్నికల్లో జగన్ కొట్టిన చావు దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అంతర్గత కలహాలు కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా వరుసగా ఓడిపోతూవస్తున్న కొన్ని నియోజకవర్గాలలో ఈసారైనా TDP జెండా ఎగిరేలా చేయాలని కార్యకర్తలు అనుకుంటున్నా పార్టీ నేతలు మాత్రం తమ కుమ్ములాటలతో కష్టాలు తెస్తున్నారు. పాత తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో పరిస్థితి ఇప్పుడు అచ్చంగా ఇలాగే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ టీడీపీ జెండా ఎగరాలని కార్యకర్తలు, అభిమానులు ఉవ్విళ్లూరుతుంటే నేతలు మాత్రం ఒకరంటే ఒకరికి గిట్టక కొట్లాడుకుంటున్నారు.

తుని టీడీపీ అంటే Yanamala Ramakrishnudu పేరే వినిపిస్తుంది. ఇక్కడి నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీలో నంబర్ 2 అన్న స్థాయిలో చక్రం తిప్పిన రోజులున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వాలలో మంత్రిగా, స్పీకరుగా ఆయన పదవులు అనుభవించారు. అలాంటి రామకృష్ణుడు గత రెండు ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయకుండా తన తమ్ముడు కృష్ణుడిని బరిలో నిలిపారు. కృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. యనమల రామకృష్ణుడు నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని పేరు ఉండగా… యనమల కృష్ణుడు నియోజకవర్గంలోనే అందుబాటులో ఉన్నా పనులు చేయించలేరన్న చెడ్డపేరు ఆయనకు ఉంది. ఇలా ఇద్దరు అన్నదమ్ములూ అక్కడ చెడ్డపేరే మూటగట్టుకోవడంతో గత రెండు పర్యాయాలుగా వైసీపీ అక్కడ గెలుస్తోంది.

ఇలాంటి వేళ ఈసారి యనమల కృష్ణుడు ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో నియోజకవర్గమంతా తిరుగుతూ గట్టిగానే కష్టపడుతున్నారు. కానీ… ఈసారి ఆయనకు టికెట్ రాదంటూ యనమల రామకృష్ణుడు ఇటీవల నియోజకవర్గ నేతలకు సంకేతాలు పంపించారు. తన కుమార్తె దివ్యకు టికెట్ ఇస్తారని, ఆమె టీడీపీ నుంచి పోటీ చేస్తారని యనమల రామకృష్ణుడు అక్కడి నాయకులతో భేటీ అయిన సందర్భంలో చెప్పారు.

దీంతో అన్న తీరుపై కృష్ణుడు అలిగి యాదవ సంఘ నేతలతో సమావేశమయ్యారని… తనకు కాకుండా అన్న కూతురికి టికెట్ ఇస్తే యాదవుల ఓట్లన్నీ పడబోవని హెచ్చరికలు పంపించారని చెప్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత.. తునిలో రెండు సార్లు గెలవడంతో దాడిశెట్టి రాజాపై వ్యతిరేకత ఉండడంతో ఈసారి ఎలాగైనా టీడీపీ గెలుస్తుందన్న తరుణంలో యనమల కుటుంబంలో ముసలం రావడంతో YCP శ్రేణులు సంబరపడుతున్నాయి.టీడీపీ అధిష్ఠానం ఈ యాదవ ముసలాన్ని చల్లారుస్తుందో లేదో చూడాలి. లేదంటే.. యనమల కృష్ణుడు వేరే దారి చూసుకుంటారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.