సార్ వెళ్లినా వార్తే.. వెళ్ల‌కున్నా వార్తే.. ద‌టీజ్ కేసీఆర్‌!!

తెలంగాణ సీఎం KCR ఏం చేసినా.. సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న చుట్టూ అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. కేంద్రంతో విభేదిస్తున్న కేసీఆర్‌.. కేంద్రం నుంచి ఎవ‌రు రాష్ట్రానికి వ‌చ్చినా.. వారిని క‌లుసుకునేందుకు.. ప్రొటోకాల్ ప్ర‌కారం.. వారిని ఆహ్వానించేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఆ స‌మ‌యానికి ఆయ‌న ఏ జ్వ‌ర‌మో.. త‌ల‌నొప్పితోనో బాధ‌ప‌డుతున్నారంటూ.. సీఎంవో కార్యాల‌యం ప్ర‌క‌ట‌న ఇస్తోంది.

గ‌తంలో ప్ర‌ధాని Modi రెండు సార్లు తెలంగాణ వ‌చ్చినా..కేసీఆర్ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌క‌లేదు. ఒక‌సారి ప్రైవేటు కార్య‌క్ర‌మం అన్నారు. రెండోసారి.. ప్ర‌ధాని రాక‌కు ముందుగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్లిపోయారు. ఇలా.. కేంద్రం నుంచి ఎవ‌రు కీల‌క నాయ‌కులు వ‌చ్చినా.. ఆయ‌న ఆహ్వానం ప‌ల‌క‌క‌పోవ‌డం.. అప్ప‌ట్లో సంచ‌ల‌న వార్త‌లుగా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైద‌రాబాద్‌కు వ‌చ్చారు.

శీతాకాల విడిదిలో భాగంగా 5 రోజుల పాటు ఆమె బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో ఉండ‌నున్నారు. అయితే.. రాష్ట్ర‌ప‌తి Draupadi Murmuకు మాత్రం సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. శాలువాక‌ప్పి.. పుష్ప‌గుచ్ఛం అందించి మ‌రీ.. కేసీఆర్ స్వాగ‌తం ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. అయితే.. నిజానికి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ముర్ముకు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పింది కేసీఆరే! అప్ప‌ట్లో య‌శ్వంత్ సిన్హాను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బ‌ల‌ప‌ర‌చాలంటూ.. ఆయ‌న అనేక మందిని కోరారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ముర్ము రాష్ట్రానికి రావ‌డం.. కేసీఆర్ స్వాగ‌తం ప‌లుకుతారా? లేదా(ప్రొటోకాల్ ప్ర‌కారం)అనేది కూడా ఆస‌క్తిగా మారింది. అయితే.. చివ‌ర‌కు ఈ ఊహాగానాల‌కు తెరదించుతూ.. కేసీఆర్ ఆమెకు స్వాగ‌తం ప‌లికారు. అయితే.. రాజ్‌భవన్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై రాష్ట్ర‌ప‌తికి విందు ఇస్తున్నారు. దీనికి మాత్రం కేసీఆర్ హాజ‌ర‌య్యేది లేద‌ని Telangana భ‌వ‌న్ వ‌ర్గాలు చెప్పాయి. మొత్తానికి కేసీఆర్‌వెళ్లినా.. వెళ్ల‌క‌పోయినా..కూడా వార్త కావ‌డం గ‌మ‌నార్హం.