వైసీపీలో ఆ విప్లవ గ‌ళాలు ఏమ‌య్యాయి…?

అవును.. లేస్తే ఒక హ‌క్కు.. కూర్చుంటే మ‌రో హ‌క్కు. అన్న‌ట్టుగా పోటా పోటీగా ఉద్య‌మాలు నడిపి, ప్ర‌భుత్వానికి కంట్లో న‌లుసులుగా మారిన‌.. ఎస్సీ ఉద్య‌మ‌కారులు.. కారెం శివాజీ.. జూపూడి ప్ర‌భాక‌ర్‌.. ఏమ‌య్యారు. ప్ర‌స్తుతం వైసీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. వారు ఎందుకు మౌనంగా ఉన్నారు. అంటే.. ఎస్సీల‌కు.. ముఖ్యంగా మాల‌ల‌కు న్యాయం జ‌రుగుతోంద‌ని వారు స‌మ‌ర్ధిస్తున్న‌ట్టుగానే ఉంద‌ని అంటున్నారు.

నిజానికి వీరిద్ద‌రు.. మంద‌కృష్ణ మాదిగ‌కు వ్య‌తిరేకంగా ఏ ప్ర‌భుత్వం ఉంటే.. ఆ ప్ర‌భుత్వానికి అనుకూలంగా చ‌క్రం తిప్పుతున్న ప‌రిస్థితి ఉంద‌నేది విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో 2014-19 వ‌ర‌కు కూడా కారెం, జూపూడి ఇద్ద‌రూ కూడా టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో ప‌ద‌వులు కూడా తెచ్చుకుని.. ప్రాభ‌వం పొందారు. ఇక‌, టీడీపీ స‌ర్కారు ప‌క్క‌న ప‌డ‌గానే వైసీపీ బాట ప‌ట్టారు.

వైసీపీ అధినేత జ‌గ‌న్ను ఆశ్ర‌యించి.. మ‌ళ్లీ ప‌ద‌వులు తెచ్చుకున్నారు. మొత్తానికి మూడేళ్లుగా ఈ ఇద్ద‌రూ క‌నిపించ‌డం లేదు. వారి మాట‌లు కూడా వినిపించ‌డం లేదు. మ‌రి ఇప్పుడు ఎందుకు చ‌ర్చ‌కు వ‌స్తోందం టే.. ఎస్సీల‌కు అన్యాయం జ‌రిగిందని.. సీఎం జ‌గ‌న్ వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. టీడీపీ ఎస్సీ సెల్ నాయ‌కులు త్వ‌ర‌లోనే ఉద్య‌మానికి పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మం చేస్తున్నారు.

దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల‌ను ఏకం చేసేందుకు జ‌న‌వ‌రి 2-5 వ‌ర‌కు విజ‌య‌వాడ‌లో ధ‌ర్నాలు.. నిర‌స‌న‌లు 5న భారీ బ‌హిరంగ స‌భ‌కు.. పిలుపునిచ్చారు. మ‌రి ఇంత చేస్తున్నా.. వైసీపీలో ఉన్న కారెం శివాజీ, జూపూడి ప్ర‌భాక‌ర్‌లు ఏం చేస్తున్నారు? అనేది ప్ర‌శ్న‌. అంటే.. ఎస్సీల‌కు న్యాయం జ‌రిగిన‌ట్టేగా.? అయితే, దీనిని ఎందుకు బ‌హిరంగంగా చెప్ప‌డంలేదు. ఒక వేళ జ‌ర‌గ‌క‌పోతే.. ఎందుకు ఉద్య‌మించ‌రు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఏదేమైనా.. జ‌గ‌న్ అండ‌ర్‌లో ఈ గ‌ళాలు మూత‌బ‌డ్డాయ‌ని అంటున్నారు.