బిగ్ క్వశ్చన్: టీడీపీ జోష్ ఎవరికి నష్టం?

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజమే.. మారే కాలానికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చోటు చేసుకోవాలి. ఈ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రంగాలతో పోలిస్తే.. రాజకీయ రంగంలో అనూహ్య పరిణామాలకు అవకాశం ఎక్కువ. అంతేకాదు.. ఒక పరిణామం మొత్తం సీన్ ను మార్చేస్తుంది. అప్పటివరకు ఉన్న లెక్కలు మారేలా చేస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే ఉండదన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్న వేళ.. కేసీఆర్ తీసుకున్న బీఆర్ఎస్ నిర్ణయం పుణ్యమా అని.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే.

ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో.. ఎంతో కాలం మునుపే జాతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో తన ఉనికిని ఎందుకు చాటుకోకూడదన్న ప్రశ్న తలెత్తింది. దీనికి సమాధానంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. రిస్కుకు సిద్దపడి ఖమ్మం శంఖారావం సభను ఏర్పాటు చేయటం ఇప్పుడు టీడీపీకి లాభంగా మారింది.

తెలంగాణలో టీడీపీ నిర్వహించే సభకు ఇంత భారీగా జనసందోహం రావటమా? అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంతకూ తెలంగాణలో టీడీపీ బలపడితే లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో ఎవరికి వారు కూడికలు తీసివేతల్లో బిజీగా మారారు. రాజకీయ వర్గాల అంచనా చూసినప్పుడు టీడీపీ తెలంగాణలో బలపడితే.. నష్టం వాటిల్లేది టీఆర్ఎస్ కే నని చెప్పక తప్పదు. దీనికి కారణం టీడీపీ నుంచి అత్యధిక నేతలు కాంగ్రెస్ కు షిప్టు అయ్యారు.

కానీ.. సెకండ్ క్యాడర్.. ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ కు వెళ్లిపోయారు. టీడీపీ జోష్ లోకి వస్తే.. ఇప్పటికిప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవు కానీ.. టీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్ల షేర్ లో మాత్రం తేడా రావటం ఖాయమని చెప్పాలి. గతంలో టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతాల్లోనూ.. హైదరాబాద్ లో సెటిలర్ల ఓట్లు చీలే అవకాశం ఖాయమని చెప్పాలి. గత ఎన్నికల్లో టీడీపీ ఓట్లు చాలావరకు టీఆర్ఎస్ కు పడ్డాయి. అయితే.. 2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా.. జగన్ కు అనుకూలంగా గులాబీ బాస్ పావులు కదపటం తెలిసిందే.

ఏపీలో టీడీపీ దారుణ ఓటమికి గులాబీ బాస్ కేసీఆర్ కారణమన్న విషయంలో టీడీపీ అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. కానీ.. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండటంతో మౌనంగా ఉన్నారు. ఇప్పుడు తమకు అవకాశం లభించిన నేపథ్యంలో ఈ సారి గతంలో మాదిరి కాకుండా టీఆర్ఎస్ కు ఈసారి ఓట్లు వేసే అవకాశం తక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. టీడీపీ పోటీ చేసే ప్రతి చోట.. కనీసం వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఓట్లు చీలే వీలుందన్న అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. గులాబీ బాస్ కు జరిగే డ్యామేజ్ అధికమని చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.