బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గం మోడ‌ల్ కానుందా..?

అవును.. టీడీపీ నాయ‌కుడు, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క వ‌ర్గం పార్టీ నేత‌ల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారింది. నియోజ‌క‌వ‌ర్గంలో బాల‌య్య పెద్ద‌గా ప‌ర్య‌టించ‌క‌పోయినా.. ఉండ‌క‌పోయినా.. ఆయ‌న పేరు మాత్రం మార్మోగుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఎటు చూసినా.. బాల‌య్య పేరు, ఆయ‌న చిత్త‌రువులు క‌నిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా చూపుతున్న శ్ర‌ద్ధేన‌న్న‌ది పార్టీ వ‌ర్గాల మాట‌.

గ‌త రెండు సార్లుగా బాల‌య్య హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త్రిముఖ పోటీ ఏర్ప‌డినా..ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. మ‌రోవైపు.. అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పాగా వేసేందుకు త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ కూడా.. బాల‌య్య పేరు మాత్రం తార‌స్థాయిలో వినిపిస్తోంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

దీనికి కార‌ణం.. బాల‌య్య చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలే. రూ.2 కే అన్న పెట్టే అన్నా క్యాంటీన్ల‌ను నియోజ‌క‌వ ర్గంలోని అన్ని కేంద్రాల్లోనూ తిప్పుతున్నారు. మొత్తం ఐదు క్యాంటీన్ల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేశారు. దీంతో పేద‌లు, కార్మికులు.. ఈ క్యాంటీన్ల వ‌ద్ద‌కు వ‌చ్చి క‌డుపునింపుకొంటున్నారు. ఇక‌, గ్రామ‌స్థాయిలో అన్న వైద్య శాల‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇవి మొబైల్ వైద్య శాల‌లు. ఇవి గ్రామాల్లో తిరుగుతూ.. ఇంటికే వైద్యాన్ని చేరువ చేస్తున్నాయి.

ఏదో చిన్నా చిత‌కా.. వైద్యమే కాదు.. రూ.ల‌క్ష‌వ‌ర‌కు ఖ‌ర్చ‌య్యే ఏ రోగాన్న‌యినా.. న‌యం చేసేందుకు ఈ వైద్య శాల‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అదేవిధంగా మ‌ద్య‌, ధూమ పాన విముక్తి కోసం.. ప్ర‌త్యేకంగా త‌ర‌గతులు నిర్వ‌హిస్తున్నారు. వీటిలో పురుషుల‌ను ప్రాధాన్యం చేసి.. వారికి రూ.200 చొప్పున ఇస్తున్నారు. క్లాసుకు హాజ‌రై.. వ్య‌స‌నం నుంచి విముక్తి పొందుతున్న‌వారు పెరుగుతున్నారు. ఇలా.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అన్నీ సామాజిక ప్ర‌యోజ‌నం క‌లిగించేలా ఉండడంతో మోడ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా మారుతోంద‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు. దీంతో దీనిని చూసేందుకు, అధ్య‌య‌నం చేసేందుకు త‌మ్ముళ్లు క్యూ క‌డుతున్నారు.