బంగారు కాదు..అప్పుల తెలంగాణ‌..

బంగారు తెలంగాణ‌.. ఇది ఒక‌ప్ప‌టి మాట‌. కానీ, ఇప్పుడు అప్పుల తెలంగాణ‌! ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్ర‌భుత్వం. రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయ‌ని కేంద్రం గ‌ణాంకాల స‌యితంగా వివ‌రించింది. గ‌డిచిన ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివరించింది. 2018లో రూ.లక్షా 60వేల 296.3 కోట్ల వరకు ఉన్న అప్పులు.. 2022 నాటికి రూ.3 లక్షల 12 వేల 191.3 కోట్లకు చేరినట్లు పేర్కొంది.

లోక్‌సభలో టీఆర్ఎస్‌ ఎంపీలు వెంకటేశ్‌, రంజిత్‌రెడ్డి, కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధికశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2017-2018లో గతేడాదితో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి 16.7 శాతం ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం పేర్కొంది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. ఆ తర్వాత భారీగా పెరుగుదల ఉన్నట్లు ఆర్ధికశాఖ లెక్కల్లో వెల్లడైంది. 2022 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు వివరించింది.

అయితే, దీనిపై ఎంపీలు త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్నామ‌ని.. ద‌ళిత బంధు, రైతు బంధు వంటి ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. అందుకే అప్పులు పెరుగుతున్నాయ‌ని అన్నారు. అంతేకాదు..కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం కేసీఆర్ స‌ర్కారుపై కోపంతో నిధులు ఇవ్వ‌డం లేద‌ని, అది కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో విభ‌జ‌న నాటికి.. ఇప్ప‌టికీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, డ‌బుల్‌బెడ్ రూంల నిర్మాణం వంటివి చేప‌ట్టిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా వారు గుర్తు చేశారు. అప్పులు కొత్త‌కాద‌ని.. గుజ‌రాత్ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్ర‌మే అప్పుల్లో ఉంద‌ని స‌మ‌ర్థించుకున్నారు.