50 కొత్త మొఖాల‌కు టికెట్లు.. వైసీపీలో గుస‌గుస‌

Jagan to pick 50 new candidates for 2024 elections

ఏపీ అధికార పార్టీ వైసీపీలో అంద‌రూ పాత‌వారికే టికెట్లు ఇస్తాం. అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయండి.. పార్టీని గెలిపించండి. మీరు ప‌ట్టుద‌ల‌గా గెల‌వండి! అని పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎమ్మెల్యేల‌ను తాడేప‌ల్లికి పిలిచి మ‌రీ క్లాసులు ఇస్తున్నారు. ఓకే.. అంటూ.. నేత‌లు కూడా త‌ల‌లూపుతున్నారు. తీరా చూస్తే.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మ‌రో కోణం క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం వైసీపీకి జ‌గ‌న్ మిన‌హా.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా చేసిన ప్ర‌క‌ట‌న మేర‌కు 32 మందిపై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఈ సంఖ్య మ‌రింత ఎక్కువ‌గానే ఉంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో చాలా మంది వైసీపీ నేత‌ల‌కు చుక్కెదురు అవుతుంద‌ని అంటున్నారు. కాకినాడ సిటీ, రూర‌ల్‌, కొవ్వూరు, ఆచంట.. ఇలా అనేక నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ప‌ట్టుబ‌ట్టినా గ‌ట్టెక్క‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు.

ఇలా.. చూసుకుంటే.. మ‌రో ఐదారు టికెట్లు పెరిగే అవ‌కాశం ఉంటుంది. అంటే.. ఇప్పుడు ఉన్న 150 మంది ఎమ్మెల్యేల్లో క‌నీసం 40 మందిని మార్చ‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌, దీంతో పాటు.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన నియోజ‌క‌వ‌ర్గాలు 23. వీటిలోనూ నాయకులను ఎంచాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక్క‌ట టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారిని మిన‌హా.. మిగిలిన చోట్ల ఖ‌చ్చితంగా కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పించాలి.

అంటే.. ఇత‌మిత్థంగా.. వైసీపీ అధినేత జ‌గ‌న్..ఎంత గీసిగీసి కొత్త‌వారిని తీసుకుందామ‌ని అనుకున్నా.. క‌నీసంలో క‌నీసం 50 సీట్లు ఖాళీగా క‌నిపిస్తున్నాయి. వీరంతా కొత్త ముఖాలే అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికిప్పుడు వార‌సుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని వైసీపీ అధినేత చెబుతున్నా.. కొంద‌రు మాత్రం ప్ర‌య‌త్నాలు మాన‌డం లేదు. దీంతో ఇలాంటి వారికి 5 సీట్ల వ‌ర‌కు అవ‌కాశం ఉన్నా.. మిగిలిన సీట్లు మాత్రం కొత్తవారికే ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.