చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందా..

టీడీపీ అధినేత, ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు భద్రతపై అనుమానాలు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయనకు ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చినట్లు చెబుతున్నారు. దానితో దేశం నేత భద్రతను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన రెండు మూడు సంఘటనలు కూడా భద్రత పెంపుపై దృష్టి సారించడానికి కారణమవుతున్నాయి.

దేశంలో ఎన్‌ఎస్‌జి భద్రత ఉన్న అతి కొద్ది మంది ఉన్న వీవీఐపీల్లో చంద్రబాబు ఒకరు… అలిపిరిలో గతంలో క్లైమ్ ఓవర్ మైన్స్ తో చంద్రబాబు పై నక్సల్స్ దాడి చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు భద్రతను పెంచారు.

అప్పట్లోనే ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌జీ ఆధ్వర్యంలోని బ్లాక్ క్యాట్ కమెండోలను భద్రత కల్పించింది. 2014 లో ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన భద్రతను సమీక్షించారు.

అయితే, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం పాలైన తరువాత, చంద్రబాబు భద్రత పై మరోసారి సమీక్ష జరిగింది. ఈ సందర్బంగా ఆయన ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లే సమయంలో భద్రతను పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. దానిపై జాప్యం జరుగుతుండగానే వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి.

చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్‌ దాడికి వెళ్లడం, నందిగామలో చంద్రబాబు ప్రయాణిస్తున్నరథం పైకి రాళ్లు విసిరిన సంఘటనలో ఆయన సిఎస్‌ఓ మదుబాబు గాయపడ్డటం జరిగింది. కర్నూలు పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్ ను అక్కడ విద్యార్దులు అడ్డుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైసిపి నేతలు , చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు భద్రతను మరింత పెంచాలని ఎన్‌ఎస్‌జీ నిర్ణయానికి వచ్చింది. చంద్రబాబు బయటకు వెళ్లిన సమయంలో ఆయనకు రక్షణ గా ఉండే ఆరుగురు బ్లాక్ క్యాట్ కమాండోలకు బదులుగా, మరో ఆరుగురితో మొత్తం 12 మందిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

వీరు కాకుండా చంద్రబాబు పర్యటించే సమయంలో మార్గంలో రోడ్డు ఓపెనింగ్ పార్టీలతో పాటు, ఆయా జిల్లాల పోలీస్ యంత్రాంగం, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు, లా అండ్ ఆర్డర్ అధికారులు రక్షణగా ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంతో పాటు, జామర్ లు కూడా కాన్వాయ్ లో ఉంటాయి.

చంద్రబాబు కు రక్షణగా ఉన్న ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం, ఇతర అధికారులతో గ్రూప్ కమాండర్ కొద్దిసేపు సమావేశమై, భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచించారు. చంద్రబాబు భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్‌ఎస్‌జీ లేఖ రాసినట్టు తెలిసింది.

భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆ లేఖలో సూచించారని సమాచారం అందింది. తాము తీసుకుంటున్న చర్యలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రతను కూడా మరింత పెంచాలని వారు కోరారు.. కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖకు కూడా ఎన్‌ఎస్‌జీ తగిన సూచనలు చేసినట్టు తెలుస్తోంది..