హత్య కేసులో బయటికొస్తే విజయయాత్ర

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు బాబు.. కొన్ని నెలల కిందట ఒక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తన దగ్గరే డ్రైవర్‌గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ కుర్రాడిని కొట్టి చంపిన కేసులో బాబు ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్నారు. బాబునే స్వయంగా సుబ్రహ్మణ్యంను అతడి ఇంటి నుంచి తీసుకెళ్లడం.. తర్వాత తన శవాన్ని కార్లో తీసుకొచ్చి ఇంటిదగ్గర విడిచిపెట్టడం సంచలనం రేపింది. ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుల్లో అరెస్టయిన బాబుకు బెయిల్ దొరకడం కష్టమైంది. కేసు విచారణ జరుగుతుండగా.. రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు బాబు. ఆయన బెయిల్ పిటిషన్లను కొట్టి వేస్తూ వచ్చిన కోర్టు.. ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఇది బాబుకు గొప్ప ఊరట అనే చెప్పాలి.
ఐతే సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటూ.. బెయిల్ మీద బయటకు వచ్చిన బాబుకు.. జైలు బయట లభించిన ఘనస్వాగతం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయనేదో ఘనకార్యం చేసి బయటికి వచ్చినట్లుగా అభిమానులు ‘జై బాబు జై బాబు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఆయనకు పూల మాలలు వేసి సత్కరించారు. తర్వాత ఊరేగింపు కార్యక్రమం కూడా చేపట్టారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు చూసి సోషల్ మీడియా జనాలు షాకవుతున్నారు. బాబు ఏం సాధించారని ఈ నినాదాలు, సత్కారాలు, ఊరేగింపులు అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో జైలు నుంచి విడుదలైనపుడు ఆయన అభిమానులు కూడా ఇలాగే చేశారని.. వైసీపీ అంటేనే క్రిమినల్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అనడానికి ఇది నిదర్శనమని పేర్కొంటూ ఆ పార్టీ వ్యతిరేకులతో పాటు న్యూట్రల్ జనాలు కూడా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.