జ‌గ‌న్‌కు ఇష్ట‌మైన అధికారికి షాక్‌.. జైలు శిక్ష విధించిన హైకోర్టు

ఇటీవ‌ల కాలంలో ఏపీలోని ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌పై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తున్న విష‌యం తెలిసిందే. వారు చేస్తున్న వ్య‌వ‌హారాలు కూడా అలానే ఉండ‌డం గ‌మ‌నార్హం. కొన్నికొన్ని కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కూడా అధికారులు పాటించ‌డం లేదు. క‌నీసం.. కోర్టు అనే గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేద‌ని న్యాయస్థాన‌మే ప‌లు సంద‌ర్భాల్లో తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టింది దీంతో అలాంటి అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు కూడా న్యాయ‌స్థానం వెనుకాడ‌డం లేదు.

ఇక‌, ఈ ప‌రంప‌రంలో సీఎం జ‌గ‌న్‌కు అత్యంత ఇష్ట‌మైన అధికారిగా ముద్ర ప‌డిన టీటీడీ కార్య‌నిర్వ‌హ‌ణాధికారి(ఈవో) ఏవీ ధ‌ర్మారెడ్డి కూడా చేరిపోయారు. తాజాగా ఆయ‌న‌పైనా హైకోర్టు తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది. మేమంటే లెక్క‌లేదా? అని నిల‌దీసింది. అంతేకాదు.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన త‌ర్వాత కూడా స‌ద‌రు ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డం లేదంటే తాము ఎలా అర్ధం చేసుకోవాల‌ని ప్ర‌శ్నించింది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు నెల రోజుల‌పాటు సాధార‌ణ జైలు శిక్ష విధించింది. అదేవిధంగా 2 వేల రూపాయ‌ల జ‌రిమానా కూడా క‌ట్టాల‌ని నిర్దేశించింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ప‌నిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల‌ను కొన్నాళ్ల కింద‌ట క్ర‌మ‌బ‌ద్ధీక‌రించారు. అంటే రెగ్యుల‌రైజ్ చేశారు. అయితే.. ఈ క్ర‌మంలో టీటీడీలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను మాత్రం ప‌క్క‌న పెట్టారు. దీంతో వారు.. హై కోర్టును ఆశ్రయించారు. దీంతో విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం.. త‌మ‌ను ఆశ్ర‌యించిన‌ ముగ్గురు ఉద్యోగులను వెంట‌నే క్రమబద్ధీకరించా లని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, కోర్టు ఆదేశాలు అమలు కాలేదు.

దీంతో స‌ద‌రు ఉద్యోగులు మరోసారి కోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఉద్యోగుల విష యంలో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మారెడ్డికి నెలరోజుల జైలుశిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది.