టీడీపీకి అవకాశాలిస్తున్న వైసీపీ

పొరుగు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఏపీలో అధికార‌ వైసీపీ, ప్ర‌తిప‌క్ష‌ టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారితీస్తోందా? ఎదుటివారిని టార్గెట్ చేసే క్ర‌మంలో ఒక్కోసారి ఆయా పార్టీయే ఇరుకున ప‌డిపోతోందా? తాజాగా, ఇదే ప‌రిస్థితిని ఏపీలో అధికార వైసీపీ ఎదుర్కుంటుందా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

తమిళనాడులో తాజాగా దొరికిన‌ డబ్బుల కట్టల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో డబ్బులు దొరికాయన్న ప్రచారంతో అధికార పార్టీని ప్రతిపక్ష టీడీపీ టార్గెట్ చేసింది. అదే స‌మ‌యంలో గ‌తంలో టీడీపీపై చేసిన విమ‌ర్శ‌ల‌ను గుర్తు చేస్తూ ఇర‌కాటంలో ప‌డేస్తోంది.

దాదాపుగా ఓ నాలుగు సంవ‌త్స‌రాల వెన‌క్కు వెళితే…2016 నవంబర్ 8వ తేదీన నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటించారు. ఈ నిర్ణ‌యం అనంత‌రం సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే 2016 డిసెంబర్ 8వ తేదీన త‌మిళ‌నాడుకు చెందిన వ్యాపార‌వేత్త‌ శేఖర్ రెడ్డి ఆయన స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లోనే శేఖర్ రెడ్డి డైరీలు కూడా దొరికాయి. అందులో కొందరు నాయకులు, అధికారులకు డబ్బులు చెల్లించినట్లుగా వివరాలను పేర్కొన్నారు. సుమారు రూ.400 కోట్లు ఇలా ముడుపులు చెల్లించారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.

దీంట్లో తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు సంబంధాలు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు అప్ప‌టి ప్ర‌తిప‌క్ష వైసీపీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు బినామీ శేఖర్ రెడ్డి అని, లోకేష్ రూ. 100 కోట్లు తీసుకుని టీటీడీ బోర్డులో సభ్యుడిని చేశారు’ అని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. మూడేళ్లు తిరిగే సరికి చంద్రబాబు స్థానంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తన ప్రభుత్వ హయాంలో తొలిసారి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులను నియమించారు. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడిగా మళ్లీ అదే శేఖర్ రెడ్డిని చేర్చారు.

తాజాగా, తమిళనాడుకు చెందిన కారులో ఎమ్మెల్యే స్టిక్క‌రుతో భారీగా డబ్బులు దొరికాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్మును పట్టుకునే దమ్ముందా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్ చేశారు. మంత్రుల అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో ఐదు కోట్లు పట్టుబడటాన్ని బట్టి… వైసీపీ ఎమ్మెల్యే దోపిడీ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చంటూ ట్వీట్ చేశారు.

కాగా, గ‌తంలో త‌మిళ‌నాడులో ప‌ట్టుబ‌డిన డ‌బ్బుల‌కే టీడీపీకి లింకు పెట్టిన‌పుడు ఇప్పుడు సాక్షాత్తు సొంత మంత్రి స్టిక్క‌ర్‌తో పెద్ద ఎత్తున డ‌బ్బులు దొరికిన విష‌యంలో ఎందుకు స్పందించ‌డం లేద‌ని టీడీపీ సూటిగానే నిల‌దీస్తోంది. అవినీతి విష‌యంలో నిక్క‌చ్చిగా ఉంటాన‌నే జ‌గ‌న్ ఈ డ‌‌బ్బుల ప‌ర్వంపై ఇంకా ఎందుకు స్పందించ‌లేద‌ని ప్ర‌శ్నిస్తోంది.