పొరపాటు చేసి తల పట్టుకుంటున్న కేజ్రీవాల్

ఎంతటి నాయకుడైనా ఏదోక పొరపాటు చేస్తారంటారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పొరపాటు చేసి ఇప్పుడు తలపట్టుకుంటున్నారు గజరాత్ ఎన్నికల్లో ఆయా రామ్ గయా రామ్ లకు టికెట్లిచ్చి ఇప్పుడు ఆయన ఇబ్బందుల్లో పడ్డారు.

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 156 స్థానాలు పొందింది. తొలి సారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సత్తా చాటింది. 12 శాతం ఓటు షేర్ తో ఐదు స్థానాల్లో గెలిచింది. ఈ క్రమంలో ఆప్ కు జాతీయ హోదా పొందే సువర్ణావకాశాన్ని సాధించింది. అంతవరకు బాగానే ఉన్నా.. గుజరాత్ లో ఆప్ కు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి..

ఆప్ తరపున గెలిచిన ఐదుగురిలో ముగ్గురు పక్క చూపులు చూసే పరిస్థితి ఏర్పడింది. విసావదార్ ఎమ్మెల్యే భూపత్ భయానీ, బోతాడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమేష్ మఖ్వానా, గారియాధార్ ఎమ్మెల్యే సుధీర్ వాఘానీ… ఇప్పుడు అధికార బీజేపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు..

నిజానికి ఆ ముగ్గురు బీజేపీలో పుట్టి పెరిగిన వారే, అక్కడ టికెట్ రాకపోవడంతో ఆప్ లో చేరి కేజ్రీవాల్ ఇచ్చిన బీ ఫార్మ్ తీసుకుని గెలిచారు. ఇప్పుడు బీజేపీ అధికారానికి రాగానే సొంత పార్టీలోకి వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పైగా గుజరాత్ ప్రజలు బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చారని, ఆ మెజార్టీని గౌరవించడం తమ ధర్మమని చెబుతున్నారు.దానితో చేసిన పొరపాటును కేజ్రీవాల్ గ్రహించారు.

అయినా ఇప్పుడు చేయగలిగిందేముంది మెజార్టీ వర్గం వెళ్లిపోతుండటంతో పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి కూడా రారని తెలిపోయింది. మరో పక్క ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.. దానితో గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ బలం 162కు పెరుగుతుంది….