కరోనా వ్యాక్సిన్ పరిశోధనల్ని కొట్టేస్తున్నారట

కరోనా వ్యాక్సిన్.. ఇప్పుడు ప్రపంచం దృష్టంతా దీని మీదే ఉంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వేల మంది ప్రాణాలు బలిగొంటూ.. లక్షల మందిని అస్వస్థుల్ని చేస్తూ.. కోట్ల మందిని రోడ్డున పడేస్తూ.. దేశాల ఆర్థిక వ్యవస్థల్నే కుప్పకూలుస్తున్న కరోనా మహమ్మారిన అదుపు చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పరిశోధనలు జరుపుతున్నాయి. కరోనా పుట్టుకు కారణమైన చైనాతో పాటు ఆ వైరస్ వల్ల అత్యంత ప్రభావితం అయిన అమెరికా.. ఇంకా బ్రిటన్, రష్యా, ఇండియా లాంటి దేశాలు కరోనా పరిశోధనల్లో చాలా చురుగ్గా ఉన్నాయి. అటు ఇటుగా కొన్ని నెలల్లో వ్యాక్సిన్‌ను బయటికి తెచ్చేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. ఐతే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌కు ఉన్న తీవ్ర డిమాండ్ దృష్ట్యా.. వ్యాక్సిన్ పరిధోనల్ని దొంగిలించేందుకు ఓ దేశం ప్రయత్నిస్తున్న వైనం చర్చనీయాంశం అయింది.

ఆ దేశం మరేదో కాదు.. రష్యా. సైబర్ ఎటాక్ ద్వారా తమ దేశ శాస్త్రజ్ఞుల కంప్యూటర్లలోకి చొరబడి.. అత్యంత రహస్యంగా ఉంచిన కరోనా పరిధోధనల తాలూకు సారాంశాన్ని దొంగిలించేందుకు రష్యా ప్రయత్నిస్తోందంటూ వివిధ దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాలు ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. వీటిలో అమెరికా, బ్రిటన్ కరోనా వ్యాక్సిన్ పరిశోధనల్లో చాలా ముందంజలో ఉన్నాయి. ఈ రెండు దేశాల నుంచి డేటా చౌర్యం ద్వారా వ్యాక్సిన్ పరిశోధనల సమాచారాన్ని రష్యా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తోందని ఆ దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తయారీ విషయంలో ఇంతకుముందు వెనుకబడి ఉన్న రష్యా.. ఇటీవల రేసులో ముందుకు రావడం, ఆ దేశానికి చెందిన ఓ యూనివర్శిటీ వ్యాక్సిన్ తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసినట్లు ప్రకటించడం తెలిసిన సంగతే.